సీఎం కేసీఆర్ టార్గెట్... వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటన
రేపు(జూన్2వ తేదీ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సీఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వెల్ లో పర్యటించనున్నారు వైఎస్ షర్మిల.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా గజ్వేల్ పర్యటనకు వైఎస్ షర్మిల రంగం సిద్దం చేసుకున్నారు. రేపు(జూన్2వ తేదీ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వెల్ లో పర్యటించనున్నారు షర్మిల. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఆత్మహత్య చేసుకున్న యువత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు.
రేపు(మంగళవారం) గన్పార్క్ వద్ద నివాళులర్పించి గజ్వేల్కు బయలుదేరనున్నారు షర్మిల. ఇందుకోసం ఇప్పటికే షర్మిల వర్గం ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నే టార్గెట్ గా చేసుకుని షర్మిల గజ్వేల్ పర్యటన సాగనుంది.
read more రెండేళ్లలో తెలంగాణలో అధికారంలోకి, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం: వైఎస్ షర్మిల
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల ఇటీవల ఇందిరాపార్క్ వద్ద దీక్షకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్షను ప్రారంభించారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత మంది ఆత్మహత్యలు చేసుకొన్నా కేసీఆర్ లో ఎందుకు చలనం కలగడం లేదని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ఛాతీలో గుండె ఉందా బండరాయి ఉందా అని ఆమె అడిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సునీల్ సిరిసిల్లకు చెందిన మహేందర్ యాదవ్, నల్గొండకు చెందిన సంతోష్ కుమార్ ఆత్మహత్యలను ఆమె ప్రస్తావించారు. ఏ పార్టీ, ఏ నాయకుడు పోరాటం చేసినా చేయకున్నా తాము నిరుద్యోగుల తరపున తాము పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలోను తాజాగా గజ్వేల్ పర్యటన చేపట్టారు.