YS Sharmila: ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మోసం చేస్తున్నారు.. కేసీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్
మూడు గంటలు ధర్నాచేసి.. రైతు చట్టాలను (Farm Laws) రద్దు చేపించామని కేసీఆర్ (KCR) జబ్బలు చర్చుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంత మొనగాళ్లైతే ఆరు గంటలు ధర్నా చేసి.. రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై (KCR) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మండిపడ్డారు. ఉత్తుత్తి ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగా.. ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను మసిపూసి మారేడ్ కాయ చేయాలని.. మోసం చేయాలని చూస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. కొనుగోలు సెంటర్లను పెట్టడం కాదని.. అక్కడ కాంటాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పండించిన ధాన్యం వర్షం పాలు కాకముందనే కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో పోస్టులు పెట్టారు.
మూడు గంటలు ధర్నాచేసి.. రైతు చట్టాలను (Farm Laws) రద్దు చేపించామని కేసీఆర్ జబ్బలు చర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంత మొనగాళ్లైతే ఆరు గంటలు ధర్నా చేసి.. రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలన్నారు. మంచి జరిగితే టీఆర్ఎస్ నేతలు వారి అకౌంట్లో వేసుకుంటారని.. లేకుంటే పక్కోని మీద బట్టకాల్చి వేయడం వాళ్లకు అలవాటే అని విమర్శించారు.
Also read: నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు.. కేసీఆర్ పై షర్మిల విమర్శలు..!
దొంగ హామీలతో గద్దెనెక్కి తెలంగాణ (Telangana) సమాజాన్ని మోసం చేస్తున్న కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. పాలకులకు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు సీఎం కేసీఆర్ అని ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ టీపీ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి నోటిఫికేషన్లు రాకపోవడంతో కొందరు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలి సంతకం జాబ్ నోటిఫికేషన్స్ పైనే చేస్తానని చెప్పారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ఏజ్ లిమిట్ పెంచడానికి కూడా కృషి చేస్తామన్నారు. ఈ మేరకు కూడా ఆమె ట్వీట్ చేశారు.