తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ హస్తం వుందంటూ బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు వైఎస్ షర్మిల.
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టే టీఎస్ పిఎస్సి పేపర్లు లీకవడం చిన్నవిషయం కాదని... దీని వెనక పెద్దవాళ్లు వున్నారని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ పేపర్ల లీకేజీ తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదులుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తో పాటు ఆయన పీఎ హస్తం ఈ పేపర్ల లీకేజీలో వుందని ... అందుకే తూతూ మంత్రంగా సిట్ తో దర్యాప్తు చేయిస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే సిట్ దర్యాప్తు జరుగుతుంటే ఇక పేపర్లు లీక్ చేసినవారు దొరికినట్లే అటూ షర్మిల ఎద్దేవా చేసారు.
ఇవాళ వైఎస్ షర్మిల టీఎస్ పిఎస్సి పేపర్ల లీకేజీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పార్టీ శ్రేణులతో కలిసి లోటస్ పాండ్ నుండి బయలుదేరిన ఆమె నేరుగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు అందజేసారు. ఐటీ శాఖ వైఫల్యం వల్లే టిఎస్ పిఎస్సి పేపర్లు లీక్ అయ్యాయని... దీనికి బాధ్యులైన వారిపై కేసు నమోదుు చేసి చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను కోరారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద షర్మిల మాట్లాడుతూ... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని అన్నారు. కేవలం ఒక ఐపి అడ్రస్ తెలిసినంత మాత్రాన ఇంత సులభంగా పేపర్ ఎలా లీక్ చేయొచ్చు..? ఐపి అడ్రస్ తెలిస్తే ఏ కంప్యూటర్ అయినా హ్యాక్ చేయొచ్చా..? అని ప్రశ్నించారు. 2000 ఐటీ శాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో వాడే ప్రతి కంప్యూటర్ ఐటీ శాఖ పరిధిలోనే ఉంటుందన్నారు. కాబట్టి టీఎస్ పిఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్స్ నుండి ప్రశ్నపత్రాలు లీకవడం ఐటీ శాఖ వైఫల్యమేనని... ఇందుకు ఆ శాఖ మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేసారు.
Read More టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. తమ్ముడు కోసం పేపర్ కొనుగోలు చేసిన అన్న..!
ఈ టీఎస్ పిఎస్సి పేపర్ల లీక్ తో తనకు సంబంధం లేదని... బాధ్యుడిని కానని మంత్రి కేటీఆర్ అనడాన్ని షర్మిల తప్పుబట్టారు. తాను ఐటీ మంత్రిని మాత్రమే... ప్రతి కంప్యూటర్ కి మంత్రిని కాదని కేటీఆర్ అంటున్నాడని గుర్తుచేసారు. ఇలా బాధ్యతల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని షర్మిల అన్నారు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఆయన మీద కేసు పెట్టామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టే కీలకమైన ప్రశ్నపత్రాలు భద్రపరిచే టీఎస్ పిఎస్సీ కంప్యూటర్లతో కనీసం ఫైర్ వాల్స్ లేవని ఆరోపించారు. నిజంగానే ఆ కంప్యూటర్లకు తగిన భద్రత వుంటే బయటపెట్టాలని కోరారు. ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకుండానే మళ్లీ పరీక్షలు పెడుతున్నారని... మళ్ళీ పేపర్ లీక్ కాదని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీ అని కేసీఅర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి రెండేళ్లు అయ్యింది... కానీ ఇప్పటివరకు కనీసం 30వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని... ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయని హడావిడి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ తీరుతో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారని షర్మిల అన్నారు.
