యువకుడితో అక్రమ సంబంధం, భర్త ఆత్మహత్య: కుమారుడి చేతిలో మహిళ ప్రియుడు హతం
ఖమ్మం జిల్లాలో ఓ మహిళతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలు తీసింది. మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడిని ఆమె కుమారుడు నరికి చంపాడు.
ఖమ్మం: ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం ఉదయం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్లలో జరిగింది. కొడిమెల ఉపేందర్ రావు అలియాస్ ఉప్పలయ్య (25) గ్రామంలోని ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆమె భర్త ఉప్పలయ్యను హెచ్చరించాడు.
అయినా వినకపోవడంతో మూడేళ్ల క్రితం పెద్దల వద్ద పంచాయతీ పెట్టాడు. వారు యువకుడిని మందలించారు. కొద్ది రోజుల పాటు అతను మహిళకు దూరంగానే ఉన్నాడు. అయితే, ఆ తర్వాత తిరిగి మహిళ వద్దకు రావడం సాగించాడు. దాంతో మనస్తాపానికి గురై ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత యువకుడు తిరిగి మహిళతో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు.
అది తట్టుకోలేని కుమారుడు బండి నరేష్ (18) ఆ యువకుడిని హెచ్చరించాడు. అయినా అతని తీరు మారలేదు. దీంతో నిన్ను చంపుతానంటూ ఉప్పలయ్యను నరేష్ హెచ్చరిస్తూ వచ్చాడు. శుక్రవారం అర్థరాత్రి నరేష్ గొడలి పట్టుకుని వెళ్లి డాబాపై పడుకుని ఉన్న ఉప్పలయ్యపై దాడి చేశాడు. గొడ్డలితో గొంతుపై నరికి చంపాడు.
ఆ తర్వాత గొడ్డలితో సహా వెళ్లి బోనకల్లు పోలీసులకు లొంగిపోయాడు. ఇంటిపై నుంచి రక్తం కారుతుండడంతో ఉప్పలయ్య తల్లి పైకి వెళ్లి చూసింది. కుమారుడి శవం రక్తం మడుగులో కనిపించింది. విషయాన్ని ఉప్పలయ్య కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తన కుమారుడిని నరేష్ ఒక్కడే చంపలేదని, మరో నలుగురు యువకులు కలిసి చంపారని ఉపేందర్ తల్లి పోలీసులకు చెప్పింది. నరేష్ తో పాటు ఇతరుల పాత్ర ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.