హైదరాబాద్ లో విషాదం... అమీర్ పేట్ హాస్టల్లో నిరుద్యోగి ఆత్మహత్య
ఉద్యోగాన్వేణ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఓ గుంటూరు యువకుడు అమీర్ పేటలోని ఓ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడంలేదన్న మనస్తాపంతో ఓ ఆంధ్రా యువకుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమీర్ పేటలో తాను నివాసముంటున్న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నెమలికల్లుకు చెందిన ప్రవీణ్ రెడ్డి(28) ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తే కేరీర్ బావుంటుందని భావించిన అతడు ఇటీవలే నగరానికి వచ్చాడు. అమీర్ పేటలోని ఓ హాస్టల్లో వుంటూ ఉద్యోగాన్వేషణ ప్రారంభించాడు. అయితే కరోనా కారణంగా కంపనీల్లో కొత్తగా నియామకాలు జరగకపోవడంతో ఎంత ప్రయత్నించినా ప్రవీణ్ కు ఉద్యోగం రాలేదు. దీంతో అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.
read more భద్రాద్రి జిల్లాలో విషాదం... పురుగులమందు తాగిన ప్రేమజంట, యువతి మృతి
ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయిన ప్రవీణ్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం తాను నివాసముంటున్న హాస్టల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో వుండే మిగతా యువకులు ప్రవీణ్ మృతదేహాన్ని గమనించి హాస్టల్ నిర్వహకులకు సమాచారమిచ్చారు. వారు పోలీసులకు పిర్యాదుచేయగా ఎస్ఆర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.