చెప్పుతో కొట్టి అవమానించిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య
ఇంటికి వెళ్లిన ఎల్లేష్.. జరిగిన విషయాన్ని భార్యతో రోదిస్తూ తెలిపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.
గ్రామంలో వీధి లైట్లు వేయాలని.. అవి లేకుంటే ఇబ్బందిగా ఉందంటూ ఓ యువకుడు గ్రామ సర్పంచిని కోరాడు. అయితే.. దానికి సమాధానం చెప్పాల్సిన సర్పంచ్.. సదరు యువకుడిని చెప్పుతో కొట్టి అవమానించాడు. దీంతో.. ఆ అవమానాన్ని తట్టుకోలేక సదరు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సర్పంచ్ ధరావత్ రమేష్ ఆదివారం తండాలో వీధి లైట్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు కూడా వీధిలైటు వేయాలని తండాకు చెందిన గుగులోతు ఎల్లేష్ (28) సర్పంచ్ను అడిగాడు. నన్ను అడిగేందుకు నువ్వేవరివి అని సర్పంచ్ పేర్కొనడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది.
కోపోద్రిక్తుడైన సర్పంచ్.. ఎల్లేష్ను చెప్పుతో కొట్టాడు. ఇంటికి వెళ్లిన ఎల్లేష్.. జరిగిన విషయాన్ని భార్యతో రోదిస్తూ తెలిపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కాగా, తండావాసులు సోమవారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సర్పంచ్పై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తండావాసులు డిమాండ్ చేశారు. చివరకు మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమి, రూ.30 వేల నగదు ఇచ్చేలా తండా పెద్దలు నచ్చచెప్పారు.