ఒకడి సెల్ఫీ మోజుకు మరో యువకుడు బలి... సింగూర్ ప్రాజెక్ట్ వద్ద దారుణం
ఓ యువకుడి సెల్పీ మోజు మరో యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ వద్ద చోటుచేసుకుంది.
సంగారెడ్డి: ఓ యువకుడి సెల్పీ మోజు మరో యువకుడి ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సింగూర్ ప్రాజెక్ట్ వద్ద ప్రమాదకర రీతిలో సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు నీటిలో పడిపోగా అతడిని కాపాడేందుకు స్నేహితుడు నీటిలో దూకాడు. అయితే నీటి ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతవగా ఓ యువకుడిని మాత్రం అధికారులు సురక్షితంగా కాపాడారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్ట్ నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇలా ఓవైపు నిండుకుండలా ప్రాజెక్ట్, మరోవైపు గేట్లెత్తడంతో దిగువకు జలజలా పారుతున్న నీటితో ప్రాజెక్ట్ వద్ద ఆహ్లాదరకమైన వాతావరణం ఏర్పడింది. దీంతో ఆ అందాలను వీక్షించేందుకు భారీగా ప్రకృతి ప్రేమికులు సింగూరు ప్రాజెక్ట్ వద్దకు వస్తున్నారు.
వీడియో
ఇలా హైద్రాబాద్ కు చెందిన ఓ యువకుడు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన ఓ స్నేహితుడితో సింగూరు ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. ప్రాజెక్ట్ దిగువన గేట్ల నుండి జాలువారుతున్న నీటివద్ద సెల్ఫీ కోసం ఓ యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. దీన్ని గమనించిన మరో యువకుడు స్నేహితున్ని కాపాడేందుకు నీటిలోకి దూకాడు.
read more తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!!
యువకులిద్దరినీ గమనించిన ప్రాజెక్ట్ అధికారులు గేట్లను మూసేసి నీటి ప్రవాహాన్ని తగ్గించారు. దీంతో గేట్ వద్ద ఓ యువకుడు కనిపించగా తాడు సాయంతో అతడిని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. మరో యువకుడు మాత్రం అప్పటికే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతయిన యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది.