Medak: అతిగా మొబైల్ వాడుతున్నాడని తల్లి మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్ ఫోన్ లో తరచు గేమ్స్ ఏంటని తల్లి మందలించడంతో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన మృతుడు వంశీ ఆదివారం ఉదయం రహీంగూడ గ్రామ శివారులోని చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.
Mobile Games-Suicide: అతిగా మొబైల్ వాడుతున్నాడని తల్లి మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్ ఫోన్ లో తరచు గేమ్స్ ఏంటని తల్లి మందలించడంతో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన మృతుడు వంశీ ఆదివారం ఉదయం రహీంగూడ గ్రామ శివారులోని చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.
వివరాల్లోకెళ్తే.. మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నందుకు తల్లి మందలించిందని ఒక యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిలిప్చేడ్ మండలంలోని రహీంగూడ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంగూడకు చెందిన నీరుడి వంశీ(18) ఐటీఐ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. ఏపని చేయకుండా ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుండటంతో శనివారం తల్లి మందలించింది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన వంశీ ఆదివారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
తల్లిదండ్రులు మందలించారని..
గతవారంలో ఇలాంటి విషాదమే మరొకటి చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించిన తర్వాత.. మెదక్లో రైల్వే ట్రాక్పై యువకుడు శవమై కనిపించాడు. రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో రైలు పట్టాలపై ఓ యువకుడు శవమై కనిపించాడు. అతను రైలు ముందు దూకి ఉంటాడని అనుమానిస్తున్నారు. మాసాయిపేటకు చెందిన తలారి సాయికుమార్ (23) ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. దీంతో కుమార్ సోమవారం రాత్రి (జూన్ 5న) ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం (జూన్ 6న) మాసాయిపేట సమీపంలోని రైల్వే ట్రాక్ పై అతని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకునీ, దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
