కాళ్లుచేతులు కట్టేసి, గోనెసంచిలో కుక్కి...చెరువులో యువకుడి డెడ్ బాడీ... అక్రమ సంబంధమే కారణమా?
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ చెరువులో ఓ యువకుడి మృతదేహం బయటపడింది. అతడి మృతికి అక్రమ సంబంధమే కారణంగా తెలుస్తోంది.
రంగారెడ్డి : యువకుడి చితకబాది ప్రాణాలతో వుండగానే కాళ్లుచేతులు విరిచి కట్టేసి, గొనెసంచిలో కుక్కి, పెద్ద బండరాయి కట్టి చెరువులో విసిరేసి అత్యంత దారుణంగా హతమార్చారు. వివాహితతో అక్రమ సంబంధమే యువకుడిని ఇంత దారుణంగా చంపడానికి కారణమై వుంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
షాబాద్ మండలం హైతాబాద్ గ్రామ శివారులోని చెరువులో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సీఐ యాదయ్య గౌడ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడు కుమ్మరి ప్రవీణ్(31) గా గుర్తించారు.
మృతుడిది షాబాద్ మండలానికే చెందిన సంకెపల్లిగూడ గ్రామం. అదే గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధమే అతడి హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధం వ్యవహారం తెలిసి వివాహిత కుటుంబసభ్యులే ప్రవీణ్ ను ఇంత దారుణంగా చంపివుంటారని భావిస్తున్నారు. మృతుడి సోదరుడు కుమ్మరి ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు షాబాద్ పోలీసులు.
మొదట ప్రవీణ్ తలపై కొట్టడంతో స్పృహతప్పి వుంటాడని... ఆ తర్వాత కాళ్లుచేతులు విరిచికట్టి గోనెసంచిలో కుక్కి హైతాబాద్ చెరువువద్దకు తీసుకువచ్చి వుంటారని అనుమానిస్తున్నారు. అక్కడే ఓ పెద్ద బండరాయికి ఈ గోనెసంచిని కట్టి చెరువులో పడేసి వుంటారని భావిస్తున్నారు. అయితే ప్రవీణ్ ఎలా చనిపోయాడో పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలనుంది.
ప్రవీణ్ అక్రమ సంబంధాన్ని కలిగివున్న మహిళ కుటుంబసభ్యులపై అనుమానాల నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగానే విచారణ చేపట్టారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని... పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.