హుజురాబాద్ లో విషాదం... నీటిగుండంలో పడి యువకుడు మృతి
కరీంనగర్ జిల్లా బిజిగిరి షరీఫ్ గ్రామ శివారులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్దగల నీటిగుండంలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం బిజిగీరి షరీఫ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని గుట్టపై ఉన్న లక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్దగల నీటి గుండంలో పడి కరీంనగర్ కు చెందిన మహమూద్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడు ప్రమాదవశాత్తు నీటిగుండంలో పడి చపిపోయాడా లేక మరేదైనా కారణం వుందా అన్నది తెలియాల్సి వుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
నీటిగుండంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే గతంలో కూడా ఈ నీటిగుండంలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గత నెలలోనే చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఇలా చిన్నారి మరణాన్ని మరిచిపోకముందే మరొకరు నీటిగుండంలో పడి చనిపోవడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది.