యువకుడి మర్మాంగాలను కోసి చిత్రహింసలకు గురిచేసి చివరకు గొంతుకోసి అతి కిరాతకంగా హతమార్చిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది.  

వికారాబాద్: మర్మాంగాన్ని కోసి చిత్రహింసలకు గురిచేసి యువకున్ని అత్యంత కిరాతకంగా హతమార్చిన దారుణం వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. అక్రమ సంబంధమో లేక ఇతర గొడవలేమైనా కారణమో తెలీదుగానీ 19ఏళ్ల యువకుడి మృతదేహం నిర్మానుష్య ప్రాంతంలో మర్మాంగం, గొంతు కోయబడి రక్తపుమడుగులో కనిపించింది.

వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లి గ్రామానికి చెందిన శివప్ప కుమారుడు యుగేంద్ర (19) పెయింటింగ్ పనులు చేస్తుండేవాడు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసముండేవారు. పరిగి పట్టణంలో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో యుగేంద్ర పెయింటింగ్ పనులు చేసి కుటుంబపోషణలో తండ్రికి సహకరించేవాడు. 

గత శనివారం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న యుగేంద్ర రాత్రి 8‌-9గంటల మధ్య ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్ళాడు. ఎప్పటిలాగే కొద్దిసేపు స్నేహితులతో గడిపి వస్తాడని తల్లిదండ్రులు భావించారు. కానీ అర్థరాత్రి అయినా అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురయిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. 

అయితే ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో యువకుడి మృతదేహం రక్తపుమడుగులో కనిపించింది. యువకుడి మర్మాంగాన్ని కోసి చిత్రహింసలకు గురిచేసి చివరకు గొంతుకోసి హతమార్చారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీంచారు. యుగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి శివప్ప ఫిర్యాదు మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే హన్మకొండ జిల్లాలో మద్యం మత్తులో స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ చివరకు ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బొమ్మినేని విజేందర్ రెడ్డి(29), పుట్ట షణ్ముఖ రెడ్డి, మందపురి వంశీ, రాజేష్, మేకల రాజేందర్, కుక్కల వంశీ, నరేందర్ ఈ నెల 10వ తేదీన కరుణాపురం వద్ద మద్యం తాగారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణతో తనకు సంబంధం లేదని విజేందర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఆగ్రహించిన మిగతా వారు ధర్మపురం వంతెన వద్ద అతడిని అడ్డగించి తీవ్రంగా కొట్టారు. 

ఈ గొడవలో తీవ్ర గాయాలపాలైప విజేందర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో 11వ తేదీన హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఆరుగురు పేర్లతో బాధితుడి తండ్రి కొమ్మినేని రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మాత్రం ఇద్దరిపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలో చికిత్స పొందుతూ విజేందర్ రెడ్డి శనివారం మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మసాగర్, చిల్పూరు పోలీసులు, స్టేషన్గన్పూర్ ఏసిపి రఘు చందర్ వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని షణ్ముఖరెడ్డి ఇంటి ముందు ఉంచి ఆదివారం రాత్రి ఆందోళన చేశారు.