షాక్: కాంగ్రెస్లోకి ఎర్రశేఖర్, డిఎస్ తనయుడు కూడా
టీఆర్ఎస్, బీజేపీల నుండి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా ప్రకటించారు. డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరిద్దరూ ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
హైదరాబాద్: బీజేపీకి రాజీనామా చేసినట్టుగా బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ప్రకటించారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎర్రశేఖర్ భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతానని ఆయన ప్రకటించారు. మంచిరోజు చూసుకొని నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేస్తానని ఎర్రశేఖర్ తెలిపారు.
also read:రేవంత్తో ఎర్ర శేఖర్ భేటీ: కాంగ్రెస్ చీఫ్ తో పాత టీడీపీ నేతల సమావేశం, ఏం జరుగుతోంది?
గతంలో ఎర్రశేఖర్ టీడీపీ నుండి జడ్చర్ల నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడ ఆయన పనిచేశారు. టీడీపీ నుండి ఎర్రశేఖర్ బీజేపీలో చేరారు. బీజేపీలో స్థానికంగా ఉన్న నేతలతో పొసగని కారణంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు.
మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ తో భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ లోకి వచ్చినట్టుగా ప్రకటించారు. తన తండ్రి కోసం తాను టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నానని ఆయన గుర్తు చేశారు. మా నాన్న అనుమతి లేకుండానే కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన చెప్పారు.టీఆర్ఎస్ నేత గండ్ర సత్యనారాయణరావు కూడ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కూడ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.