నాకు దళిత బంధు వచ్చేలా లేదు.. మనస్తాపంతో ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 46 ఏళ్ల కూరెల్ల రమేశ్ దళిత బంధు తనకు వచ్చేలా లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు దళిత బంధును అడ్డుకుంటున్న కౌన్సిలర్ కారణం అని ఆరోపించాడు.
హైదరాబాద్: దళిత బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు రూ. 10 లక్షలు అందిస్తున్నది. విడతల వారీగా లబ్దిదారుల ఎంపిక జరుగుతున్నది. ఎంపికైతే పంట పండినట్టేనని చాలా మంది ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అప్పులు చేసి మరీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా దళిత బంధు వస్తే ఒక్కసారిగా సెటిల్ అయిపోవచ్చనే ఆశ వీరిలో ఉన్నది. ఇలాగే యాదాద్రి భువనగిరికి చెందిన కూరెళ్ల రమేశ్ కూడా ఆలోచించాడు.
మోత్కూరు మున్సిపాలిటీలోని గాంధీనగర్కు చెందిన 46 ఏళ్ల కూరెళ్ల రమేశ్ దినసరి కూలీ. ఒక బిడ్డ, ఒక కొడుకు సంతానం, వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇటీవలే దళిత బంధు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. దళిత బంధుకు ఎంపికై రూ. 10 లక్షలు వస్తే దుకణం పెట్టాలని ఆశించాడు. కుటుంబాన్నీ పోషించుకోవచ్చని అనుకున్నాడు.
ఆ కాలనీలో మొదటి విడతలో భాగంగా ఎంపికైన కొందరికి దళిత బంధు నిధులు అందాయి. రెండో విడత జాబితా ఇంకా తయారీలోనే ఉన్నది. రెండో విడతలో తన పేరు వచ్చేలా చూసుకోవాలని రమేశ్ ఆరాటపడ్డాడు. తమ 12వ వార్డు కౌన్సిలర్ కూరెల్ల రామస్వామి, ఇతర నేతలను రమేశ్ తరుచూ కలుస్తున్నాడు. కానీ, తన ప్రయత్నాలతో ఆశించిన ఫలితం వచ్చేలా లేదనే నిస్సహాయత మనసులో అలుముకుంది. తనకు దళిత బంధు రాదేమో అనే బాధలోకి వెళ్లిపోయాడు.
Also Read: భర్తను నల్లవాడని పిలవడం క్రూరత్వమే: దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు
భార్య యాదమ్మ కూలికి, కొడుకు సామేల్ కాలనీలోని అత్తవారింటికి వెళ్ళడంతో రమేశ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. దళిత బంధు గురించి ఆలోచిస్తూ తీవ్ర నిస్సహాయతకు గురయ్యాడు. అంతే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికి సామేల్ ఇంటికి వచ్చి డోర్ తీయగా రమేశ్ ఉరి తాడుకు వేళాడుతూ కనిపించాడు. కాలనీ మొత్తం కలకలం రేగింది. రమేశ్ సూసైడ్ లెటర్లో తన చావుకు కారణం దళిత బంధుకు ఎంపిక కాకపోవడమే అని ఉన్నది. ఆ విధంగా తన చావుకు కౌన్సిలర్ కూరెల్ల కుమారస్వామి కారణం అని రమేశ్ రాశాడు. కౌన్సిలర్ను ఈ విషయంపై ప్రశ్నలు వేశారు పోలీసులు. దళిత బంధు ఎంపిక తన చేతిలో ఉండదని, అది ఎమ్మెల్యేల ఉంటుందని కౌన్సిలర్ స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.