ప్రముఖ రచయిత్రి కెబీ లక్ష్మి కన్నుమూత
ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు డాక్టర్ కొల్లూరి భాగ్యలక్ష్మి సోమవారం రాత్రి మృతి చెందారు. రైలులో ప్రయాణీస్తున్న సమయంలో గుండెపోటుతో ఆమె మృతి చెందారు.
హైదరాబాద్:ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ డాక్టర్ కొల్లూరి భాగ్యలక్ష్మి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకొన్నారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో గుండెపోటుతో ఆమె మృతి చెందారు. విపుల మాసపత్రికలో ఆమె పనిచేశారు. పదేళ్ల క్రితం ఆమె ఉద్యోగ విరమణ చేశారు. కంచిలోని అత్తివరద రాజపెరుమాల్ దర్శనం కోసం హైద్రాబాద్ నుండి ఆమె రైలులో వెళ్లారు. భాగ్యలక్ష్మితో పాటు మరో 50 మంది ఆమె వెంట ఉన్నారు.
దైవ దర్శనం తర్వాత ఆమె తన బృందంతో కలిసి సోమవారం అరక్కోణం రైల్వేస్టేషన్ నుండి తిరుగు ప్రయాణమయ్యారు.చెన్నై ఎగ్మోర్ రైలులో ఆమె హైద్రాబాద్ కు బయలుదేరారు. సోమవారం రాత్రి 8 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోకి రైలు సమీపించిన సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది.
తోటి ప్రయాణీకులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే భాగ్యలక్ష్మి మృతి చెందారు. మృతదేహన్ని హైద్రాబాద్ కు తరలించారు. భాగ్యలక్ష్మికి కొడుకు, కూతురు ఉన్నారు. భాగ్యలక్ష్మి కొడుకు అమెరికాలో ఉన్నాడు. కూతురు బెంగుళూరులో నివసిస్తోంది.రేడియో వ్యాఖ్యాతగా, కథా రచయిత్రిగా ఆమె బహుముఖ ప్రజ్ఞ చాటారు