హైదరాబాద్ లాడ్జిలో శవమై తేలిన ప్రియురాలు.. ఒంగోలు ఆసుపత్రిలో ప్రియుడు, మిస్టరీ
హైదరాబాద్ (hyderabad) చందానగర్లో (chandanagar) దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని ఓ వ్యక్తి లాడ్జిలో హత్య చేశాడు. ఈ జంటను నాగచైతన్య, కోటిరెడ్డిగా పోలీసులు గుర్తించారు
హైదరాబాద్ (hyderabad) చందానగర్లో (chandanagar) దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని ఓ వ్యక్తి లాడ్జిలో హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా (prakasam district) కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె గొర్రెముంచు నాగ చైతన్య (naga chaitanya) (24). ఈమె నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రిలో (citizen hospital) స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. ఇదే సమయంలో గుంటూరు జిల్లా రెంటచింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి (kotireddy) మెడికల్ రిప్రజంటెటీవ్గా పని చేస్తున్నాడు.
అయితే తరచూ పనుల నిమిత్తం సిటిజన్ ఆఫీసుకు వచ్చి వెళ్లే క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ నెల 23న ఆసుపత్రి ఎదురుగా వున్న ఓయోలో వీరిద్దరూ గది తీసుకున్నారు. మరుసటి రోజు ఆదివారం రాత్రి సమయంలో గది తలుపులు తీయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. అనంతరం రక్తపు మడుగులో నాగచైతన్య మృతి చెందినట్లుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. అనంతరం నాగచైతన్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రేమికుడు కోటిరెడ్డి పొట్టలో, గొంతు దగ్గర కత్తి గాట్లతో ఒంగోలు వెళ్లి ఆసుపత్రిలో చేరినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆమె గొంతు కోసుకుందని, భయంతో నేను వచ్చేశానని అతను చెబుతున్నాడు. పోలీసుల పరిశీలనలో గదిలో మద్యం సీసాలతోపాటు రక్తం మడుగును కడగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.