బలవంతంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంవల్లే ఓ మహిళ మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
భూపాలపల్లి: కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ (omicron) వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో వ్యాక్సినేషన్ (corona vaccine) ప్రక్రియను తెలంగాణ (telangana) ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు కనీసం ఒక్కడోసు కూడా వ్యాక్సిన్ వేయించుకోని వారిని స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో వైద్యసిబ్బంది గుర్తిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ టీకా ఇస్తున్నారు. అయితే వైద్యసిబ్బంది బలవంతంగా కరోనా వ్యాక్సిన్ టీకా ఇవ్వడంతోనే మహిళ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... భూపాలపల్లి జిల్లా (bhupalpally district) మహదేవపూర్ మండలం ఎడపెల్లి గ్రామానికి చెందిన రాపెల్లి సరోజ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. రెండురోజుల క్రితమే ఆమె ఇంటికి వచ్చిన వైద్యసిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వ్యాక్సిన్ వద్దని చెప్పినా వినిపించుకోకుండా వైద్యసిబ్బంది బలవంతంగా టీకా తీసారట. ఇలా వ్యాక్సిన్ వేసిన రెండు రోజుల తర్వాత సరోజ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందింది.
ఆరోగ్యం బాగాలేకపోయినా వైద్యసిబ్బంది బలవంతంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతోనే సరోజ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎంపిపి రాణిబాయ్ వైద్యసిబ్బందిని తీసుకువచ్చి బలవంతంగా వ్యాక్సిన్ వేయించారంటూ ఆమెపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
read more Omicron Cases in India: భారత్లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
అయితే కరోనా వ్యాక్సిన్ వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశమే లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇతర అనారోగ్య కారణాల వల్లే సరోజ చనిపోయి వుంటుందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు కలిగించేలా ఇలా దుష్ఫ్రచారం చేయడం తగదని... ప్రాణాల కాపాడేందుకు వ్యాక్సిన్... తీయడానికి కాదని పేర్కొంటున్నారు.
ఇదిలావుంటే తెలంగాణలో న్యూ వేరియంట్ (corona new variant) ఒమిక్రాన్ తో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణలో 7 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు బయటపడ్డ కేసుల సంఖ్య 62కు చేరింది.
ఇక కరోనా కేసులు కూడా తెలంగాణలో పెరుగుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో ఎక్కువగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ (hyderabad) శివారులోని నార్సింగిలో కరోనా కలకలం రేపింది. ఒకే కాలేజీలో ఏకంగా 25 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్గా తేలింది. నార్సింగిలో ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు గత కొన్నిరోజులుగా తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం మిగతా విద్యార్థులకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక మున్సిపల్ సిబ్బంది కాలేజీ పరిసర ప్రాంతాల్లో మొత్తం శానిటైజేషన్ చేయించారు. మిగిలిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బంది సూచించారు.