మద్యం కోసం కన్న బిడ్డను అమ్మేసిన తల్లి..
ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితం వీరికి ఒక బాబు అద్నాన్ పుట్టాడు.
తన కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలని తల్లి తాపత్రయపడుతుంది. తన కడుపు మాడ్చుకొనైనా సరే.. బిడ్డను కాపాడుకోవాలని భావిస్తుంది. అలాంటిది ఓ తల్లి మద్యానికి బానిసై అందుకోసం బిడ్డనే అమ్మేసింది. మద్యం తాగడానికి తన వద్ద డబ్బులు లేవని.. తన కడుపున బిడ్డను బేరం పెట్టేసింది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోని హబీబ్ నగర్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఏఎస్ మగ్రాలో నివాసం ఉండే అబ్దుల్ జోయా ఖాన్, అబ్దుల్ ముజాహిద్లకు ఇది వరకే వేర్వేరుగా పెళ్లిళ్లు అయ్యాయి. అబ్దుల్ జోయా ఖాన్ భర్తతో విడిపోగా, ముజాహిద్ కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితం వీరికి ఒక బాబు అద్నాన్ పుట్టాడు.
అబ్దుల్ ముజాహిద్ ఎర్రమంజిల్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం వీరు హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబాన్పురాకు మకాం మార్చారు. ఈ నెల 3న జోయా ఖాన్, ముజాహిద్లు గొడవ పడ్డారు. దీంతో ముజాహిద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. జోయాఖాన్కు మద్యం అలవాటుంది.
మద్యానికి బానిసైన ఆమె డబ్బు కోసం తన బాబును అమ్మే ప్రయత్నాల్లో ఉంది. ఇదిలా ఉండగా .. పాతబస్తీ కాలాపత్తర్లో నివాసం ఉండే ఫరాజ్ కూతురికి ఇటీవలే బాబు పుట్టి చనిపోయాడు. దీంతో ఆమె మతిస్థిమితం తప్పింది. ఓ పసికందును ఆమె వద్దకు చేర్చితే యథాస్థితికి వస్తుందని ఫరాజ్ భావించింది. బిడ్డ కోసం ఆగాపురాలో నివాసం ఉండే తన బంధువైన షేక్ ముజాహిద్ను ఆశ్రయించింది.
షేక్ ముజాహిద్, అతడి భార్య తబసుమ్ బేగం జోయాఖాన్ను కలిశారు. రూ. 45 వేలకు బాబును కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 8వ తేదీన తిరిగి ఇంటికి వచ్చిన జోయా ఖాన్ భర్త అబ్దుల్ ముజాహిద్కు కుమారుడు కనిపించలేదు. బాబు ఎక్కడున్నాడని భార్యను ప్రశ్నించగా అమ్మేసినట్లు చెప్పింది. ఫరాజ్ కుటుంబీకుల వద్ద బాబు ఉన్నాడన్న విషయం తెలుసుకుని వారిని సంప్రదించాడు.
తన బాబును ఇచ్చేయాలని కోరాడు. వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం హబీబ్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబును తండ్రికి అప్పగించారు.