హైద్రాబాద్లో కాల్పుల కలకలం: తోటి ఉద్యోగిపై ఎస్బీఐ సెక్యూరిటీ గార్డు కాల్పులు
హైద్రాబాద్ ఎస్బీఐ ఆబిడ్స్ బ్రాంచీలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరుపుకొన్నారు. ఈ కాల్పుల్లో సురేందర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.
హైదరాబాద్: హైదరాబాద్ ఆబిడ్స్ ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే సెక్యూరిటీ గార్డు బ్యాంకులో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్ పై కాల్పులు జరుపుకొన్నారు. ఈ ఘటనలో గాయపడిన సురేందర్ అనే వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఆబిడ్స్ లోని ఎస్బీఐ బ్యాంకులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే సురేందర్ పై సర్ధార్ ఖాన్ అనే సెక్యూరిటీ గార్డు కాల్పులకు దిగాడు.
తన వద్ద ఉన్న తుపాకీతో సర్ధార్ ఖాన్ సురేందర్ పై కాల్పులకు దిగాడు. సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సురేందర్ పై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా స్థానికులు చెప్పారు. కాల్పులు జరిపిన సర్దార్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బ్యాంకు సమీపంలోనే కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు.
కొంతకాలంగా సురేంద్ర, సర్ధార్ ఖాన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం సురేందర్ కడుపులో నుండి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సురేందర్, సర్ధార్ ఖాన్ లు మంచి స్నేహితులని కూడ పోలీసులు చెబుతున్నారు. వీళ్లిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం కూడ వీరిద్దరూ మాట్లాడుకొంటున్న సమయంలోనే మాటా మాటాపెరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కోపంలోనే సర్ధార్ ఖాన్ సురేందర్ పై తుపాకీతో కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.