వికారాబాద్లో విషాదం.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చికిత్స పొందుతూ బాలింత మృతి.. వైద్యులపై బంధువుల ఆగ్రహం
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణి.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణి.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మృతిచెందింది. వివరాలు.. వికారాబాద్ మండలానికి చెందిన రమాదేవి ప్రసవం కోసం వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అయితే అక్కడ బిడ్డకు జన్మనిచ్చిన రమాదేవి.. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటపై రమాదేవి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమాదేవి మృతికి డాక్టర్ల నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిజేరియన్ ప్రసవమైన తర్వాత నలుగురు బాలింతల అనారోగ్యం బారిన పడగా.. అందులో ఒకరు మృతిచెందిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్దకు చెందిన అలివేలు.. ప్రసవం కోసం ఈ నెల 4న పేట్లబురుజు ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆమెకు సిజేరియన్ చేయగా మగ శిశువు జన్మించాడు.
అయితే ఆ తర్వాత అలివేలు జ్వరం, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో వైద్యులు ఆమె ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించినట్టుగా ఉన్నతాధికారులు తెలిపారు.