పదిరోజుల్లో పెళ్లి.. కరోనా కాటుకు యువతి బలి..!
పెళ్లి పీటలు ఎక్కాల్సింది పోయి.. పాడె ఎక్కాల్సి వచ్చింది. కరోనా సోకడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.
మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి కరోనా కాటుకు బలయ్యింది. పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలన్న ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెళ్లి పీటలు ఎక్కాల్సింది పోయి.. పాడె ఎక్కాల్సి వచ్చింది. కరోనా సోకడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఉప్పల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉప్పల్ లోని భరత్ నగర్ కు చెందిన ఓ యువతి(22) నగరంలో ఎంబీఏ చదువుతోంది. ఆమెకు ఇటీవల కరోనా సోకింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే యువతికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ నెల 13వ తేదీన ఆమె వివాహం జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరగక ముందే నిశ్చితార్థం జరిగినా.. ముహూర్తాలు లేక పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.
తీరా ఇప్పుడు ముహూర్తాలు బాగున్నాయని.. మే 13న వివాహం నిశ్చయించారు. ఈ లోపే యువతికి కరోనా సోకవడం గమనార్హం. పెళ్లి కోసం దుస్తులు, బంగారం కొనుగోలు చేస్తున్న సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూనే యువతి చనిపోయింది. యువతి మృతి తో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువులు కన్నీరు మున్నీరు గా విలపించారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona