మెడలో బంగారు నగల కోసం... మహిళ దారుణ హత్య
ఆమె ఆ పెళ్లికి వెళ్లాలని భావించి శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరింది. బయట పరిస్థితులు సరిగాలేవని అందరూ వారించినా.. వినకుండా బయలుదేరి వెళ్లింది.
మెడలో బంగారు నగల కోసం ఓ మహిళను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శామీర్ పేటలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం లాల్ గడిమలక్ పేటకు చెందిన పొలంపల్లి లక్ష్మి(60) భర్త బుచ్చిరెడ్డి నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి ఐదుగురు కుమార్తెలు కాగా.. అందరికీ పెళ్లిళ్లు జరిపించారు. ఓ కుమార్తెను మాత్రం సొంతూరుకే ఇచ్చారు. ఇదిలా ఉండగా.. లక్ష్మి తమ్ముడి కుమారుడికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది.
దీంతో.. ఆమె ఆ పెళ్లికి వెళ్లాలని భావించి శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరింది. బయట పరిస్థితులు సరిగాలేవని అందరూ వారించినా.. వినకుండా బయలుదేరి వెళ్లింది. అయితే.. ఆమె పెళ్లికి చేరుకోలేదనే సమాచారం రావడంతో కూతుళ్లకు అనుమానం కలిగింది.
పోలీసులకు సమాచారం అందించడంతో.. మరుసటి రోజు శవమై కనిపించింది. ఆమె ఒంటిపైన 5 తులాల బంగారం కూడా మాయం కావవడంతో.. ఆ బంగారం కోసం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.