ఆ భిక్షగత్తె.... లక్షాధికారి: ఇలా బయటపడింది
: హైద్రాబాద్ నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఓ వృద్ధురాలి వద్ద రూ.2.34 లక్షలను జీహెచ్ఎంసీ అధికారులు కనుగొన్నారు
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఓ వృద్ధురాలి వద్ద రూ.2.34 లక్షలను జీహెచ్ఎంసీ అధికారులు కనుగొన్నారు. అయితే ఆమె దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయించారు అధికారులు.
హైద్రాబాద్ నగరంలో దిల్సుఖ్నగర్ సమీపంలోని టీవీ టవర్ వద్ద భిక్షాటన చేస్తూ బిజిలి పెంటమ్మ అనే వృద్దురాలు జీవనం సాగిస్తోంది. పెంటమ్మను ఆనందాశ్రమానికి జీహెచ్ఎంసీ అధికారులు తరలించారు అయితే ఆమె వద్ద ఉన్న ఇంటి సామానును తీసుకురావాలని ఆమె జీహెచ్ఎంసీ అధికారులను కోరింది.
అయితే పెంటమ్మ ఇంటిలో సామాను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ఆమె వద్ద రూ.2.34 లక్షలు ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు చేతులకు వెండి ఆభరణాలు, మెడలో బంగారు గొలుసులున్నాయి.
2011లో హైద్రాబాద్ అంబర్పేటలో తన వాటా కింద ఉన్న 60 గజాల రేకుల ఇంటిని విక్రయిస్తే బంధువులు రూ. 2 లక్షలను ఇచ్చారని ఆమె జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పారు. రూ. 2 లక్షల్లో కోడళ్లు, మనమళ్లకు రూ. లక్ష రూపాయాలను ఇచ్చినట్టు చెప్పారు. తన వద్ద లక్ష రూపాయాలను దాచుకొన్నట్టు చెప్పారు. అయితే భిక్షాటన చేస్తూ మరో 1.34 లక్షలను సంపాదించినట్టు ఆమె తెలిపారు.
ఈ మొత్తం కలిపి రూ. 2.34లక్షలు ఉన్నట్టు పెంటమ్మ చెప్పారు. అయితే ఇంత మొత్తం ఆమె వద్దే ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు ఎస్బీఐ చర్లపల్లి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ నగదును అందులో డిపాజిట్ చేయించారు.