భర్త కొట్టాడంటూ పుట్టింట్లో చెప్పిన భార్య.. అల్లుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి
కూతురిని కొట్టిన అల్లుడికి అత్తింటి వారు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నీరజను వావిలాల గ్రామానికి చెందిన దొంగరి మురళికి వివాహం జరిగింది.
కూతురిని కొట్టిన అల్లుడికి అత్తింటి వారు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నీరజను వావిలాల గ్రామానికి చెందిన దొంగరి మురళికి వివాహం జరిగింది.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండగా.. భర్త చెడు వ్యసనాలకు అలవాటుపడి తనను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని నీరజ కేసు పెట్టింది. దీనిపై అతనిని పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్లి వచ్చాడు.
అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ విడిగా ఉంటున్నారు. ఇటీవల మురళి తల్లి మృతి చెందడంతో నీరజ వచ్చి వావిలాలలో అతడితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది.
తన భర్త.. తనతో పాటు పిల్లల్ని కొట్టాడని నీరజ తిరిగి మల్లంపల్లికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన నీరజ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అప్పటికప్పడు వావిలాలకు వెళ్లి మురళిని మల్లంపల్లికి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు.
అనంతరం పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇలాంటి సంఘటన పునరావృతం కావొద్దని హెచ్చరించి పంపించారు.