వారిద్దరిదీ ప్రేమ వివాహం.. యేడాది క్రితం ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి మోజులో పడిపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్తనే చంపడానికి ప్రయత్నించింది. మజ్జిగలో నిద్రమాత్రలు కలిపిచ్చి.. ప్రియుడితో పరారయ్యింది.
నాగోల్ : love marriage చేసుకున్న ఓ వివాహిత కొత్తగా పరిచయమైన ప్రియుడి మోజులోపడి భర్తనే అంతం చేయాలని పథకం వేసింది. ప్రియుడి ద్వారానే ఒక Supari Gangకు రూ. ఐదు లక్షలు ఇప్పించింది. ఆమె ‘కనిపించకుండా పోవడం’తో ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించగా.. Missing case నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..
కారుకు జిపిఎస్ తో కదలికలపై ఆరా..
నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి పరిధిలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన పొలగోని భాస్కర్ గౌడ్, హరిత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం నగరానికి వలస వచ్చారు. ఇసుక వ్యాపారం చేసే భాస్కర్ మన్సూరాబాద్ మధురానగర్ కాలనీలో వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వెంకటేష్ సైతం ఎల్బీనగర్ ప్రాంతంలో లారీల ద్వారా ఇసుక వ్యాపారం చేసేవాడు. కొన్నాళ్ళు వీరిద్దరూ కలిసి వ్యాపారం చేశారు. అలా హరితతో వెంకటేష్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
వెంకటేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని వ్యవహార శైలి ఇరుగుపొరుగు వారి ద్వారా కుటుంబీకులకు తెలియడంతో వారు భాస్కర్ దంపతులను ఇంటి నుంచి ఖాళీ చేయించారు. ఆ తర్వాత వీరు చింతలకుంట ప్రాంతానికి మకాం మార్చినప్పటికీ వెంకటేష్, హరితల మధ్య సంబంధం కొనసాగింది. భాస్కర్ కదలికలను తెలుసుకునేందుకు వెంకటేష్ అతడి కారుకు జిపిఎస్ పరికరం బిగించాడు. దీని ఆధారంగా అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం గుర్తించి తాను హరిత వద్దకు వెళ్ళేవాడు. భాస్కర్ తన ఇంటి సమీపానికి వస్తుంటే జిపిఎస్ అలారం మోగించేది, అలా అతని రాకను తెలుసుకుని వెళ్ళి పోతుండేవాడు.
అడ్డు తొలగించుకునేందుకు పన్నాగం…
వెంకటేష్ మోజులో పడిన హరిత తన ఆనందానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. అతడిని అంతం చేయించాలని ప్రియుడికి సూచించింది. దీంతో అతడు ఈ పనిని మన్సురాబాద్ కు చెందిన నవీన్ కు అప్పగించాడు.
అతడి ద్వారా రంగంలోకి దిగిన నల్లగొండకు చెందిన రౌడీషీటర్ తో ఒప్పందం చేసుకున్నాడు. సుపారీగా రెండు విడతల్లో రూ. 5 లక్షలు చెల్లించాడు. ఈ కుట్రను అమలు చేయడానికి అనువైన సమయం కోసం ఎదురు చూశారు.
ఇందులో భాగంగా ఈ నెల 16న హరిత మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇచ్చింది. అతడు నిద్రలోకి జారిపోయాక వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ప్రియుడితో కలిసి తిరుపతికి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో భాస్కర్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో వెంకటేష్ మీద అనుమానం వ్యక్తం చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక ఆధారాలతో ఇరువురిని తిరుపతిలో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. విచారణ నేపథ్యంలో వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం, భాస్కర్ హత్యకు కుట్ర తదితరాలు వెలుగులోకి వచ్చాయి. భాస్కర్ ను హత్య చేసేందుకు అదును కోసం ఎదురు చూస్తున్న వీరు.. అతడి కారుకు బిగించిన జిపిఎస్ పరికరం ద్వారా కదలికలు గుర్తిస్తున్నట్లు వెల్లడయింది. దీంతో ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నవీన్ ను పట్టుకున్నారు. రాజేష్ కోసం గాలిస్తున్నారు.
