కరోనా ఎఫెక్ట్: బీర్కూర్లో భర్త చనిపోయిన 3 రోజులకి భార్య మృతి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్లో మూడు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు కరోనాతో మరణించారు. రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్లో మూడు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు కరోనాతో మరణించారు. రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. బీర్కూర్ కి చెందిన సిద్దులుకి కరోనా సోకింది. కోవిడ్ బారినపడిన సిద్దులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మరణించాడు.భర్త చనిపోయిన మూడు రోజులకి భాగ్యవ్వ శుక్రవారం నాడు మరణించింది. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ప్రవేశించే మార్గాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజుకు 400కి పైగా కేసులు నమోదౌతున్నాయి. ఈ జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది కూడ ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసులను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నైట్ కర్ఫ్యూ విధించినా కూడ కరోనా కేసుల పెరుగుదల తగ్గడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కూడ స్వీయ నిర్భంధాన్ని పాటించాలని ఆరోగ్య శాఖాధికారులు కోరుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరుతున్నారు.