తండ్రికే మళ్లీ టికెట్టు: అంటీముట్టనట్టు చందూలాల్ తనయుడు
భవిష్యత్తుపై భరోసా లేదనే కారణంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
ములుగు: భవిష్యత్తుపై భరోసా లేదనే కారణంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఆయన అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి చందూలాల్ టీఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో చందూలాల్కు చోటు దక్కింది. పర్యాటక శాఖ మంత్రిగా చందూలాల్ కొనసాగుతున్నారు.
అయితే చందూలాల్ మంత్రిగా ఉన్న సమయంలో కొంత కాలానికి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత యధావిధిగా విధులకు హాజరౌతున్నారు. చందూలాల్కు తోడుగా ఆయన తనయుడు ప్రహ్లాద్ ఉండేవాడు.
చందూలాల్ వ్యవహరాలు ప్రహ్లాద్ చూసేవాడని చెబుతుండేవారు.ప్రహ్లాద్ ప్రస్తుతం మార్కెట్ కమిటీ ఛైర్మెన్గా కొనసాగుతున్నారు. ములుగు నుండి మరోసారి చందూలాల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.అయితే ఈ దఫా ప్రహ్లాద్ పోటీకి ఆసక్తిగా ఉన్నారు. కానీ, పార్టీ మాత్రం చందూలాల్ వైపే మొగ్గు చూపింది.
అయితే మరో ఐదేళ్ల తర్వాత తనకు టిక్కెట్టు ములుగు నుండి వచ్చే పరిస్థితి ఉంటుందా.. అనే విషయమై ప్రహ్లాద్ ఆందోళన చెందుతున్నట్టు కన్పిస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై తండ్రితో ప్రహ్లాద్ చర్చించినట్టు చర్చ సాగుతోంది.ఈ కారణంగానే ప్రహ్లాద్ ప్రచారంలో కొంత వెనుకంజ వేస్తున్నారనే సమాచారం.