కేసీఆర్ కేబినెట్లో ఆ ఇద్దరు మహిళా మంత్రులు వీరేనా
కేసీఆర్ కేబినెట్లో ఆ ఇద్దరు మహిళా మంత్రులు వీరేనా
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తానని ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఎవరా ఇద్దరు అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసారి పద్మాదేవేందర్ రెడ్డికి పక్కా అని అంతా చెప్పుకుంటున్నారు. పద్మాదేవేందర్ రెడ్డితోపాటు మరోక ఎమ్మెల్యే ఎవరా అంటూ చర్చించుకుంటున్నారు.
గతంలో ప్రభుత్వ విప్ గా పనిచేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అయి ఉంటారని కొందరు కాదు ఎస్టీ కోటాలో రేఖానాయక్ కు అవకాశం కల్పిస్తారని మరికొందరు లేదు సత్యవతి రాథోడ్ కే అవకాశం కల్పిస్తారని ఇంకొందరు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది
టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఆది నుంచి మహిళలకు అవకాశం కల్పించలేదు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. తెలంగాణ కేబినేట్లో మహిళలకు చోటు దక్కకపోవడంపై కేసీఆర్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గత ఎన్నికల్లో ఇదే అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ప్రయోగించాయి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు.
మహిళలపట్ల కేసీఆర్ కు చిన్నచూపు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి మహిళల ఓట్లు కొల్గగొట్టేందుకు ప్రయత్నించాయి. అయితే విపక్షాల విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు కేసీఆర్. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. అయినా కేసీఆర్ మహిళలకు చోటు కల్పించలేదు.
తెలంగాణలో ఏర్పడిన మంత్రులలో 12 మందిలో ఏ ఒక్క మహిళలకు అవకాశం కల్పించలేదు. కేబినేట్ విస్తరణ తర్వాత కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది కేసీఆర్ కి. ఇలాంటి తరుణంలో తరుణంలో కేసీఆర్ తర్వాత జరగబోయే విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.
మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, ఎమ్మెల్సీలిగా సత్యవతి రాథోడ్ కు అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందారు.
వారిలో మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీత, రేఖా నాయక్ లు గెలుపొందారు. వీరిలో పద్మాదేవేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలోనూ, టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. గత ప్రభుత్వంలో ఈమె ఉపసభాపతిగా పనిచేశారు. ఇక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఈమె గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా పనిచేశారు. ఇకపోతే నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా నాయక్. ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్ కు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. ఈమె రాజకీయాల్లో చాలా సీనియర్. రాజకీయ అనుభవం దృష్ట్యా ఆమెకు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలను కొట్టి పారేయ్యలేం. ఎస్టీ కోటాలో సత్యవతి రాథోడ్ కు అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాజీ హోంశాఖ మంత్రి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమెకు మంత్రి పదవి ఇస్తే ఆమె పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె భూగర్భగనుల శాఖ మంత్రిగా, కీలకమైన హోంశాఖ మంత్రిగా పనిచేశారు సబితా ఇంద్రారెడ్డి. ఈమె టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే పద్మాదేవేందర్ రెడ్డికి, గొంగిడి సునీతారెడ్డిలకు ఇబ్బందేనని టాక్. మరి కేబినేట్ విస్తరణకు సంబంధించి కేసీఆర్ మదిలో ఏముందో అన్నది తెలియాలంటే లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు వేచి చూడాల్సిందే.