ఆర్టీసీ సమ్మెకు బ్రేకులు:నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే....
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చర్యలు తీసుకొంటారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్: షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయమై ఏ నిర్ణయం తీసుకొంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది
ఆర్టీసీ కార్మికులు 48 రోజులుగా సమ్మె చేస్తున్నారు.ఈ ఏడాది అక్టోబర్ 5 వతేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఎసీ నేతలు సమ్మె విరమణ కోసం సానుకూలంగా ప్రకటన చేశారు.
ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని లేబర్ కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనే విషయమై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం విచక్షణకు వదిలేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో అనే రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మె చేస్తున్నఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని రెండు దఫాలు కోరింది.కానీ ఆర్టీసీ సమ్మెను విరమించలేదు ఆర్టీసీ కార్మికులు.
ఈ నెల 5వ తేదీ లోపుగా విధుల్లో చేరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో దఫా కోరారు. కానీ, కేవలం 400 మంది మాత్రమే విధుల్లో చేరారు.మిగిలిన కార్మికులంతా సమ్మెలోనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలు విధుల్లో చేరాలని కోరింది. కానీ, విధుల్లో చేరేందుకు కార్మికులు వెనుకడుగు వేశారు. ఆర్టీసీ కార్మికులకు రెండు దఫాలు అవకాశం ఇచ్చినా కూడ విధుల్లో చేరలేదు. అయితే ఇప్పుడు విధుల్లో చేరుతామని ప్రకటించడంపై ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కొంత అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
ఒకవేళ కార్మికులు విధుల్లో చేరితే గతంలో సీఎం ప్రకటించినట్టుగా కార్మికులకు షరతులు విధించే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. సమ్మె నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాల్లో చేర్చుకొనే వారికి ఏ యూనియన్లో చేరబోమని ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకొంది.
ఈ మేరకు ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ కొత్తగా నిబంధనల రూపకల్పన కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలను సిద్దం చేసింది. అయితే విధుల్లో చేరాలనుకొన్న కార్మికులను ఇప్పుడు షరతులతో విధుల్లోకి తీసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయంతో ఉన్నారు.యూనియన్లతో సంబంధం లేకుండా విధుల్లో చేరేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే కార్మికులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్టీసీ సమ్మె విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తాము సమ్మె విషయంలో మెట్టు దిగినట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. కానీ ప్రభుత్వం ఈ విషయమై ఏ రకంగా స్పందిస్తోందోననే విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేబర్ కోర్టులో ఈ విషయమై ఏ రకంగా ఉంటుందనే విషయమై ఆర్టీసీ జేఎసీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించారు. రెండు వారాల్లో ఈ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు లేబర్ కోర్టుకు సూచించింది.
కానీ, రెండు వారాల్లోనే ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.ఈ విషయాలన్నింటిపై ఆర్టీసీ జేఎసీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత సమ్మె విరమణపై సానుకూల ప్రకటన చేసినట్టుగా సమాచారం.