కాశ్మీర్ లో హిందూ పండిట్లపై జరిగిన మారణ హోమంపై టీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో అర్థం కావడం లేదని వివేక్ రంజన్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో కల్వకుంట్ల కవిత ఒక విధంగా మాట్లాడితే, ఇప్పుడు సీఎం కేసీఆర్ మరోలా మాట్లాడారని ఆయన ట్వీట్ చేశారు.
కాశ్మీర్ లో హిందూ మారణ హోమంపై టీఆర్ఎస్ (trs) స్టాండ్ ఏంటని ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి (vivek ranjan agnihotri) అన్నారు. 2014లో పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) కాశ్మీర్ హిందూ పండిట్ల పరిస్థితిపై బాధను వ్యక్తం చేశారని, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అదే అంశంపై భిన్నంగా మాట్లాడుతోందని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ట్వీట్ చేశారు.
2014 లో టీఆర్ఎస్ ఎంపీ కవిత మాట్లాడిన వ్యాఖ్యలను జత చేస్తూ వివేక్ రంజన్ అగ్ని హోత్రి ఈ ట్వీట్ చేశారు. ‘‘ కాశ్మీర్ మారణహోమంపై టీఆర్ఎస్ ఎంపీ కవిత పార్లమెంటులో చెప్పిన మాట ఇది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కాశ్మీరీ హిందూ మారణహోమాన్ని అపహాస్యం చేశారు. మరి ఈ రెండింటిలో టీఆర్ఎస్ అధికారిక స్టాండ్ ఏంటో తెలియాల్సి ఉంది. ’’ అంటూ ఆయన తెలంగాణ సీఎంవో (telangana cmo)ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
మార్చి 11వ తేదీన విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (the kashmir files) సినిమా 1990లో కాశ్మీర్ నుండి వలస వెళ్లిన పండిట్లు, పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల అతి కిరాతక చర్యలు వంటివి ఆధారంగా చేసుకొని చేసుకొని రూపొందించారు. అగ్నిహోత్రి రచన, దర్శకత్వం వహించి, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది.
దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకర్శిస్తోంది. ఈ సినిమాకు హర్యానా (haryana), మధ్యప్రదేశ్ (madhya pradesh), గుజరాత్ (gujarat) సహా అనేక బీజేపీ (bjp) పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయించారు. ఇదిలా ఉండగా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ద్వారా ప్రభుత్వం సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేయాలని చూస్తోందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భారతదేశం సినిమాల ద్వారా కాకుండా ప్రభుత్వ విధానం, పాలన ద్వారా నడుస్తుందని అన్నారు. “ సినిమాలు చూసి, చూపించి, సమాజంలో విద్వేషాలు, చీలికలు వ్యాప్తి చేయడం వల్ల జీవితం నడవదు. మన కాశ్మీరీ పండిట్లకు ఎప్పుడు పునరావాసం కల్పిస్తారో మోదీజీ చెప్పాలి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వం ఉన్నందున ఒక తేదీ కచ్చితంగా చెప్పాలి.’’ అని కాంగ్రెస్ (congress) ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (randeep surjewala) అన్నారు.
ఈ సినిమాను ప్రధాని మోదీ (prime minister modi)ప్రశంసించారు. ఇలాంటి సినిమాలు నిజాన్ని బయటపెడతాయని, దానిని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రచారం జరుగుతోందని అన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. సినిమాలను విమర్శించే వారిపై విరుచుకుపడిన ప్రధాని, ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన సత్యాన్ని ఇది ఎత్తి చూపుతోందని అన్నారు.
