జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలంటూ పెళ్ళి మండపంలోనూ నూతన వధూవరులు వినూత్న నిరసన చేపట్టారు.  

కరీంనగర్ : పెళ్ళి మండపంలోనే నవ వధూవరులిద్దరూ నిరసన చేపట్టిన విచిత్ర సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.పెళ్లి బంధంతో ఒక్కటైన జంట కొత్త సంసారం ఆనందంగా సాగేలా ఉద్యోగ భద్రత కల్పిచాలని కేసీఆర్ సర్కార్ ను కోరారు. తోటి ఉద్యోగులు నిరసనలో మునిగివుండగా తాము హాయిగా పెళ్లిలో ఎంజాయి చేయడం సరికాదని భావించారో ఏమో... పెళ్లిదుస్తుల్లో మండపంలోనే ప్లకార్డులు ప్రదర్శించారు జూనియర్ పంచాయితీ కార్యదర్శి జంట. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నాలుగేళ్ళ కింద తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగేళ్ల ప్రొహిబిషనరీ పీరియడ్‌ ముగిసినా పర్మినెంట్‌ చేయకపోవడంతో కొద్దిరోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు నిరసన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వీరంతా వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించేకోవడం లేదు. 

ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామ జూనియర్ పంచాయితీ కార్యదర్శి నాగుల శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మానుకొండూరు జూనియర్ పంచాయితీ కార్యదర్శి మౌనికకు పెళ్ళిచేసుకుని ఒక్కటయ్యారు. తోటి ఉద్యోగులు ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని రోడ్డెక్కి నిరసనలు చేస్తుంటే తాము మాత్రం హాయిగా పెళ్లిచేసుకోవడం వారిని బాధించింది. కానీ పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్ళి చేసుకోకుండా వుండలేని పరిస్థితి. దీంతో తమ పెళ్ళినే నిరసనకు వేదికగా మార్చుకున్నారు నవ వధూవరులు. 

Read More సెక్రటేరియట్ ముట్టడికి టీజేఎస్ యత్నం: కోదండరామ్ అరెస్ట్

కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో శ్రీకాంత్-మౌనికల వివాహం జరిగింది. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ మండపంలోనే జూనియర్ పంచాయితీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలా నవ వధూవరులు పెళ్లిమండపంలోనే నిరసన తెలపడంతో అతిథులు ఆశ్చర్యపోయారు. 

ఇదిలావుంటే జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ఆందోళనకు బిజెపి మద్దతుగా నిలిచింది. పంచాయితీ కార్యదర్శుల నిరసనల్లో బిజెపి నాయకులు పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. ఇలా ఇటీవలే బిజెపి చేరిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోదరుడు రాంచందర్ రాజనర్సింహ జహిరాబాద్ నియోజకర్గ పరిధిలోని పంచాయితీ కార్యదర్శుల నిరసనకు మద్దతుగా నిలిచారు. యువ నాయకుడు నగేష్ పాటిల్ తో కలిసి న్యాల్ కల్ లో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 

ఇక షాద్ నగర్ పంచాయితీ కార్యదర్శులు చేపట్టిన మానవహారం కార్యక్రమంలో బిజెపి నేత పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం మూడేళ్ల ప్రొహిబిషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని... కానీ నాలుగేళ్ళయినా జూనియర్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేయకపోవడం అన్యాయమని బిజెపి నాయకులు మండిపడ్డారు. వెంటనే అందరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పంచాయితీ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.