రాగల రెండు రోజులూ తెలంగాణలో వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో రాగల రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో రాగల రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.
దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దీని ప్రభావంతోనే తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో (ఆగస్టు 4వ తేదీ వరకు) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
గతకొద్ది రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీటిపారుదల రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. అలాగే వాగులు, వంకలు, చెరువులు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.