ప్రభుత్వ విధానాలపై ఈ నెల 22న మహాధర్నా: రేవంత్ రెడ్డి
ఈ నెల 22న ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించనున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు గాంధీ భవన్ లో సీపీఎం, సీపీఐ, టీజేఎస్ లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలు అంశాలపై ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహిస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఆదివారం నాడు టీపీసీసీ చీఫ్ నేతృత్వంలో గాంధీ భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పోడు భూముల సమస్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనల విషయమై చర్చించారు.
టీజేఎస్ చీఫ్ కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాలు అంశాలపై ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు నేతలు.
ధరణి సమస్యలు, భూ నిర్వాసితుల , వ్యాక్సిన్ సమస్యలు, పెట్రోల్, డీజీల్ సమస్యలు, అత్యంత ముఖ్యమైన సమస్యలపై ఈ నెల 22న ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ధర్నాలో బీజేపీ, టీఆర్ఎస్యేతర పార్టీలన్నీ పాల్గొంటాయని ఆయన తెలిపారు.
ఈ నెల 27న భారత్ బంద్ ను కూడ విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. అంతేకాదు వచ్చే నెల 5వ తేదీన పోడు భూముల సమస్యలపై ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. పోడు భూముల సమస్యపై ఆదిలాబాద్ నుండి ఆశ్వరావుపేట వరకు పోడు రాస్తారోకోలు నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.
పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఆదీవాసీలు అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నారని టీజేఎస్ చీప్ కోదండరామ్ గుర్తు చేశారు. అటవీహక్కు చట్టం పరిష్కారమయ్యే వరకు ఉద్యమం సాగుతుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. పోడు భూములపై విపక్షాల పోరాటమంటే కేసీఆర్ కు భయం పట్టుకొందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు.