ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృషి: సజ్జనార్
ఆర్టీసీకి ఆదాయం తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడతామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు.శుక్రవారం నాడు ఆర్టీసీ ఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకొంటామని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ శుక్రవారం నాడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.కరోనా కారణంగా రవాణా, పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. డీజీల్ ధరలు పెరడంతో ఆర్టీసీపై మరింత భారం పడిందని సజ్జనార్ చెప్పారు. గత రెండేళ్లలో డీజీల్ ధర రూ.22 పెరిగిందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వానికి భారం కాకుండా చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చేందుకు కొత్త కార్యాచరణను మొదలుపెడతామని ఆయన చెప్పారు. కార్గో సేవలతో ఆర్టీసీకి ఆదాయం వచ్చిందన్నారు. అయితే మరింత ఆదాయం రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల కాలంలో స్పేర్ పార్ట్స్ ధరలు కూడా పెరిగాయన్నారు. ఆర్టీసీ కార్మికులకు సకాలంలో జీతాలు అందించినట్టుగా సజ్జనార్ గుర్తు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి అజయ్ కుమార్ సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.