టీఆర్ఎస్ ఉన్నంత కాలం రైతు బంధు పథకం అమలు చేస్తాం: కేసీఆర్
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతు బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులు మృత్యువాత పడితే వారికి భీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఆయన చెప్పారు.
హైదరాబాద్:టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతు బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులు మృత్యువాత పడితే వారికి భీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఆయన చెప్పారు.
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారనుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. చేతి వృత్తులను ఆదుకొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని ఆయన చెప్పారు.
ఆదివారం నాడు కొంగరకలాన్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణకు మద్దతు కోసం దేశంలోని అన్ని రాజకీయపార్టీల మద్దతును కూడ గట్టేందుకు తీవ్రంగా కృషి చేసినట్టు ఆయన చెప్పారు.
సీపీఐ అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి బర్ధన్ ను ఒప్పించేందుకు 38 సార్లు ఆయనను కలిసినట్టు ఆయన చెప్పారు. ఈ రకంగా అన్ని జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను కలుసుకొని తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఒప్పించినట్టు ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించారని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పాలన ప్రారంభించిన తర్వాత ఆరేడు మాసాల వరకు కూడ అధికారులు లేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పనులను ఎప్పుడు ఎలా పూర్తి చేసుకోవాలనే విషయమై దశలవారీగా అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చీకటిలో మగ్గిపోయే అవకాశం ఉందని ఓ మాజీ ముఖ్యమంత్రి చేసిన విమర్శలను కేసీఆర్ ఎద్దేవా చేశారు.తెలంగాణలోని రైతులకు ఉచితంగా విద్యుత్ ను 24 గంటలపాటు విద్యుత్ ను సరఫరా చేస్తున్న సర్కార్ దేశంలోనే తెలంగాణ సర్కార్ అంటూ కేసీఆర్ చెప్పారు.
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణలో చేతి వృత్తులు దెబ్బతిన్నాయన్నారు. అయితే చేతివృత్తులను ఆదుకొనేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. కళ్యాణలక్ష్మిని ప్రవేశపెట్టేందుకు ఉద్యమ సమయంలో ములుగు ప్రాంతంలో ఓ గిరిజనుడి కుటుంబం దీన స్థితి ఆధారంగానే ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు.ఎన్నికల మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. గొల్ల, కురుమలకు గొర్రె పిల్లలను అందిస్తున్నట్టు చెప్పారు.
కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల పనులు కూడ శరవేగంగా సాగుతున్నట్టు ఆయన చెప్పారు. రైతు బంధు పథకానికి సంబంధించిన మరో విడత డబ్బులను అక్టోబర్ మాసంలో విడుదల చేయనున్నట్టు చెప్పారు.
రైతులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే భీమా కల్పించి.. ఆ కుటుంబాన్ని రక్షించననున్నట్టు ఆయన చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటికే 365 మందికి భీమా సౌకర్యం కల్పించినట్టు ఆయన గుర్తు చేశారు.