విస్తరిస్తున్న మధ్యాహ్న భోజన పథకం

వేళకింత కడుపుకి బువ్వకావాలే. అది అందిచేందుకు ఏవరేపని చేసినా దండంపెట్టాలే. అంతే..

హైదరాబాద్ నగరంలో మంచి ఆదరణ పొందుతున్న 5 రూపాయలకే భోజనం వరంగల్ కు విస్తరిస్తోంది. ఈ భోజనం జనాదరణ పొందుతూ ఉండటంతో టిఆర్ ఎస్ ప్రభుత్వం మరికొన్ని నగరాలకు దీనిని విస్తరింపచేసేందుకు కృష్టి మొదలుపెట్టింది. 

ఇందులో భాగంగా వరంగల్ లో కూడా 5 రూపాయలకే భోజనం త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి చొరవతో వరంగల్ లో 5 రూపాయల భోజనం పెట్టేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది.

వరంగల్ అర్బన్ లో రైతులు, కూలీలు, రోగుల సహాయకులు ఎక్కువగా ఉండే కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొదటగా 5 రూపాయలకు భోజనం కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు.

అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకులతో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి,మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, ఆరూరి రమేష్ , వొడితెల సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మరాజు, వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ శృతి. ఓజా తదితరులు సమావేశమయ్యారు. అక్కడే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయోగాత్మకంగా ఈ పథకం 2014 మార్చిలో జిహెచ్ ఎంసి అధ్వర్యంలో హైదరాబాద్ లో మొదలయింది. నాంపల్లి సరాయ్ వద్ద పైలట్ గా మొదలయింది. అప్పటి నుంచి జనాదరణ పొందుతూనే ఉంది. టిఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ సెంటర్లు 50 అయ్యాయి. రోజుకు దాదాపు 15వేల మందికి భోజనం దొరికింది. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి కూడా ఈ భోజనాన్ని గాంధీ భవన్ కు తెప్పించుకుని తిని బాగుందని ప్రశంసించారు. తర్వాత 2016 నవంబర్ ఈసెంటర్లను వందకు పెంచాలని జిహెచ్ ఎంసి నిర్ణయించింది.