మద్యం మత్తులో వరంగల్‌లో అఖిల బార్‌లో మధు అనే వ్యక్తి తల్వార్‌తో హల్ చల్ చేశాడు. తనకు ఫుల్ బాటిల్ ఇవ్వాలని గొడవకు దిగాడు. బార్ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్‌కు వచ్చి మధును అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్: మద్యం మత్తులో కొందరు చేస్తున్న వీరంగం అందరికీ ఇబ్బందికరంగా మారుతున్నది. ఫుల్‌గా తాగి మత్తులో పోలీసులను, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. మద్యం విక్రయదారులనూ బెదిరించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. వరంగల్‌లోని అఖిల బార్‌లోకి వెళ్లిన ఓ మందుబాబు తనకు ఫుల్ బాటిల్ కావాలని ఆదేశించాడు. ఇది వరకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వాలని సిబ్బంది అడగ్గా.. బయటికి వెళ్లి తల్వార్ తీసుకువచ్చాడు. ఫుల్ బాటిల్ ఇవ్వాలని బెదిరించాడు. పోలీసులకూ తంటాలు పెట్టాడు.

వరంగల్‌లో మధు అనే వ్యక్తి మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. అఖిల్ బార్‌లో ఫుల్‌గా మందు తాగాడు. తనకు ఇంకా మందు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ, బార్ క్యాషియర్ అందుకు నిరాకరించాడు. అప్పటి వరకు తాగిన మద్యం తాలూకు డబ్బులు చెల్లించాలని అన్నాడు. దీంతో మధు ఆగ్రహంతో ఊగిపోయాడు. బార్ క్యాషియర్‌తో వాదనకు దిగాడు.

అనంతరం, మధు ఆ బార్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. కొంత సేపటికి మళ్లీ బార్‌కు ఓ తల్వార్ చేత పట్టుకుని వచ్చాడు. తనకు ఫుల్ బాటిల్ కావాలని తల్వార్‌తో బెదిరిస్తూ అడిగాడు. దీంతో బార్ నిర్వాహకులు, అక్కడే ఉన్న మరికొందరూ ఆందోళనకు గురయ్యారు. బార్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వేగంగా స్పాట్‌కు వచ్చేశారు. కానీ, ఆ మధు పోలీసులనూ బెదిరించాడు. ఫుల్ బాటిల్ ఇస్తేనే తిరిగి వెళ్లిపోతానంటూ కండీషన్ పెట్టాడు. పోలీసులు అతడిని తమ మార్గంలోకి తెచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి విసుగు చెందారు. దీంతో మధును మాటల్లో ఉంచి అదుపులోకి తీసుకున్నారు.

Also Read : భర్తకు గుణ పాఠం చెప్పాలని స్కూటర్ చోరీ కట్టుకథ.. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది!

మధు గతంలో ఆటో డ్రైవర్ పని చేసేవాడు. ప్రస్తుతం కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నాడు. ఇది వరకే మధుపై రౌడీ షీట్ ఓపెన్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వరంగల్‌లో సంచలనంగా మారింది.