ఇదేమి సలహా అధ్యక్షా.... ?
- వంశీ చిన్నవాడు, 73 ఓట్లతోనే గెలిచాడు
- నన్ను చూసి వంశీ నేర్చుకోవాలి
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సలహా
- వివాదమైన ఎమ్మెల్యే చిట్టెం సలహాలు
వారిద్దరూ రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందులో ఒకాయన మొదటి సారి ఎమ్మెల్యే. ఇంకోగాయన రెండోసారి ఎమ్మెల్యే. ముందుగా ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. కానీ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారేందుకు ఒకాయన ఇటీవల టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకోగాయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సర్కారుపై గట్టి పోరాటమే చేస్తున్నడు.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరంటే మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి. నిన్నమొన్న ఇద్దరి మధ్య పంచాయతీ నడుస్తున్నది. అదేమంటే వంశీచంద్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుకు సవాళ్ల మీద సవాళ్లు విసురుతుండు. ఆ సవాళ్ల మీద జనాల్లో గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. వంశీచంద్ పై మాటల దాడికి దిగిర్రు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు మరికొందరు నేతలు. ఈ సందర్భంగా చిట్టెం వంశీచంద్ రెడ్డికి ఇచ్చిన సలహాలు వివాదాస్పదంగా మారాయి. తను సీనియర్ ఎమ్మెల్యేగా చెబుతున్నాను అంటూ ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు వంశీకి.
ఆ సలహాలేమంటే...
వంశీ నువ్వు 73 ఓట్లతో గెలిచావు. నన్ను ప్రశ్నిస్తావా?
నేను సీనియర్ ఎమ్మెల్యేను నన్ను చూసి నువ్వు నేర్చుకో.
నాలుగైదు గంటలు సిఎంతో కూర్చుంటే నా నియోజకవర్గం అభివృద్ధి కోసం సరిపోయే నిధులు తెచ్చుకున్నా
పై సలహాలు ఇవ్వడంతో మీడియా ప్రతినిధులు సైతం గట్టిగానే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మీద ప్రశ్నల వర్షం కురిపించారు.
మీరు సీనియర్ అయితే మిమ్మల్ని చూసి నేర్చకోవాలంటే మీబాటలోనే వంశీ పార్టీ ఫిరాయించాలా? అని అడిగేసరికి చిట్టెం తడబడిపోయారు. మీబాటలో పార్టీ మారి కెసిఆర్ తో కూర్చుని నిధులు తెచ్చుకోవాలా అన్న ప్రశ్నకు కూడా ఎమ్మెల్యే చిట్టెం వద్ద సమాధానం లేకుండాపోయింది.
మొత్తానికి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహా విషయం వివాదం కావడంతో వెంటనే గువ్వల బాలరాజు కల్పించుకుని విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు.