ప్రతి దానికి లిటిగేషన్, వామన్రావు అరాచకాల చిట్టా ఇదే: గ్రామస్తుడి సంచలన ఆరోపణలు
తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్యలపై ఆయన క్లాస్మెట్, గుంజపడుగు గ్రామానికే చెందిన బండి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంథనిలో ఆయన మాట్టాడుతూ… వామన్ రావు హత్యకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలన్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్యలపై ఆయన క్లాస్మెట్, గుంజపడుగు గ్రామానికే చెందిన బండి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మంథనిలో ఆయన మాట్టాడుతూ… వామన్ రావు హత్యకు పాల్పడ్డ వారికి శిక్ష పడాలన్నారు.
అయితే వామన్ రావు చేసిన అరాచకాలు కూడా అన్నిఇన్నీ కావన్నారు. వామన్ రావు చిన్నప్పటి నుంచి నేర స్వభావం కలిగిన వ్యక్తని శ్రీనివాస్ ఆరోపించారు. తాను 3.5 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నామని, శిస్తు కూడా కడుతున్నామని ఆయన వెల్లడించారు.
అయితే రెవెన్యూ రికార్డుల్లో వామన్ రావు కుటుంబ సభ్యుల పేరిట ఉందని తెలిసి తమ పేరిటకు మార్చాలని ఆయన తండ్రి కిషన్ రావును కోరితే ఆయన రూ.3 లక్షలు గుడ్ విల్ అడిగారని బండి శ్రీనివాస్ ఆరోపించారు. కిషన్ రావు అన్న కూడా ఉన్నాడని తెలిసి ఆయనకు ఫోన్ చేస్తే.. మా తాత భూమి అమ్మాడని తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడని వెల్లడించారు.
అయితే అనూహ్యంగా సీన్లోకి వామన్ రావు జోక్యం చేసుకుని తనకే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని శ్రీనివాస్ ఆరోపించారు. దీంతో తండ్రి కొడుకులకు డబ్బులు ఇవ్వకుండా మిన్నకుండిపోయామని ఆయన గుర్తుచేశారు.
దీంతో వామన్ రావు తనతో పాటు మరో 25 మందిపై కేసులు వేశారని శ్రీనివాస్ ఆరోపించారు. ఇందులో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులతో పాటు 80 ఏళ్ల వయసున్న తన తల్లి పేరును కూడా చేర్చాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:నా భర్తను కిడ్నాప్ చేసి, చంపించాడు.. వామనరావు హత్య కేసులో మరో ట్విస్ట్.. (వీడియో)
నక్సలైట్లతో కుమ్మక్కై పోలీసు, వ్యవస్థను ప్రభావితం చేశామని వామన్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడని బండి శ్రీనివాస్ ఆరోపించారు. 80 ఏళ్ల వృద్ధురాలిపై కేసు ఎందుకు వేశారని అడిగినందుకు డీసీపీని హైకోర్టుకు వెళ్లి సస్పెండ్ చేయించారని శ్రీనివాస్ తెలిపారు.
గ్రామములో ఏ సమావేశం జరిగినా.. ఏ చిన్న కార్యక్రమం జరిగినా దానిపై హైకోర్టులో కేసులు వేయడంతో పాటు ప్రజలను వేధించడం వామన్ రావు దంపతులకు నిత్యకృత్యమైందని ఆయన ఆరోపించారు.
చట్టాన్ని అడ్డం పెట్టుకొని తమలాంటి సామాన్యులను వేధించడం ఎంతవరకు సమంజసమని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వామన్ రావు దంపతులను హత్య చేయడం దారుణమని.. హత్యలకు పాల్పడ్డవారికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.