సొంత రాష్ట్రంలోనూ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలతో సతమతం అవుతోందని బిజెపి నాయకురాలు విజయశాంతి ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యంగా వుమెన్స్ హాస్టల్స్ లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా వుందని అన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ (osmania university) నేడు సొంత రాష్ట్రంలోనూ సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి (vijayashanti) అన్నారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఈ యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థులు కనీస అవసరాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. క్యాంపస లోని లేడిస్ హాస్టల్లో వుంటున్న ఆడబిడ్డలు డోర్లు లేని బాత్రూంలలో స్నానాలు చేస్తున్నారంటేనే పరిస్థితి ఎంత అద్వాన్నంగా వుందో అర్థమవుతుందని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేసారు.

''ఉస్మానియాలో వ‌సతుల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కే ప‌రిస్థితిని కేసీఆర్ (kcr) స‌ర్కార్ తీసుకొచ్చింది. అన్నంలో పురుగులొస్తున్నాయని, పెరుగు, కూరలు సరిగ్గా ఉంటలేవని, బాత్ రూమ్‌లకు డోర్లు, లాక్‌లు లేవని ఓయూ క్యాంపస్ ఆడబిడ్డలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా అధికారులు కానీ, ప్ర‌భుత్వం కానీ ప‌ట్టించుకోవడం లేదు. పైపెచ్చు ప్రశ్నించే విద్యార్థినులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నరు'' అని విజయశాంతి పేర్కొన్నారు. 

''గత సోమవారం కూడా వందలాది మంది విద్యార్థినులు పురుగుల అన్నం, కూరలతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మాలు చేసిన విద్యార్థులు... వ‌స‌తుల కోసం రోడ్డెక్కి నిర‌స‌న చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం'' అన్నారు.

''ఓయూ లేడీస్ హాస్టల్‌లో ప్రస్తుతం సుమారు 5 వేల మంది అమ్మాయిలు చదువుతున్నరు. వారి కోసం నాలుగు మెస్‌లు నడుపుతున్నరు. మెనూ ప్రకారం రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో కిచిడి, చపాతి, ఊతప్పం, పూరి, దోశ, ఇడ్లీ పెట్టాల్సి ఉన్నా... కేవలం ఇడ్లీ, పూరీలతోనే సరిపెడుతున్నరు. వాటి కోసం కూడా గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. గతంలో వారంలో రెండు సార్లు నాన్ వెజ్ పెట్టేవారు. ప్రతి బుధవారం 150 గ్రాముల మటన్, ప్రతి ఆదివారం 250 గ్రాముల చికెన్ ఇచ్చేవారు. కొంతకాలంగా మటన్ ఆపేసిన అధికారులు... ప్రస్తుతం చికెన్ మాత్రం ఇస్తున్నరు. అది కూడా 100 గ్రాములకు మించడం లేదని విద్యార్థినులు చెబుతున్నరు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నరు'' అని విజయశాంతి తెలిపారు.

''ఓయూ క్యాంపస్ హాస్టల్స్ (ou ladies hostel) లో క‌నీసం తాగునీరు కూడా సరిగ్గా స‌ప్లై చేయ‌డం లేదు. కిటికీలు సరిగ్గా లేక గదుల్లోకి తరచూ పాములు వస్తున్నాయని విద్యార్థినులు అధికారులకు చెబుతున్నా... ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇంత‌కంటే దారుణ‌ము ఎక్క‌డైనా ఉంటుందా? దొర‌గారు ఫామ్ హౌస్‌లో ప‌డుకొని పాల‌న చేస్తే.. మ‌న ఆడ‌బిడ్డ‌లు ప‌డుతున్న క‌ష్టం ఏం తెలుస్తుంది? ఆడ‌బిడ్డ‌ల కష్టాలు ప‌ట్టని ఈ సీఎం ఉంటే ఎంత? లేకుంటే ఎంత‌? ఇప్ప‌టికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి హాస్ట‌ల్స్‌లో సౌల‌తులు క‌ల్పించాలి'' అని విజయశాంతి సూచించారు.

''తెలంగాణ ఉద్య‌మంతో దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన ఘనత ఉస్మానియా సొంతం. కేసీఆర్.... విద్యార్థుల్ని విస్మరిస్తే వారు నిన్ను కూడా కాల‌గర్భంలో క‌లిపేయడం ఖాయం. ఎన్నోసార్లు రుజువైన సత్యమిది... గుర్తుంచుకో'' అని బిజెపి (bjp) నాయకురాలు విజయశాంతి హెచ్చరించారు.