మారిన రాములమ్మ సీటు: మాజీ ఎంపీలు అసెంబ్లీకి పోటీ
మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి 11.30 గంటల దాకా కొనసాగింది. శాసనసభ ఎన్నికల బరిలోకి ఏడుగురు మాజీ పార్లమెంటు సభ్యులను దించాలని స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఎంపికకు ఢిల్లీలోని వార్ రూమ్ లో 12 గంటలకు పైగా స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది.
మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన భేటీ రాత్రి 11.30 గంటల దాకా కొనసాగింది. శాసనసభ ఎన్నికల బరిలోకి ఏడుగురు మాజీ పార్లమెంటు సభ్యులను దించాలని స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగానే విజయశాంతిని మెదక్ స్థానం నుంచి పోటీకి దించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణను మల్కాజిగిరి నుంచి లేదా కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీకి దించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ఎదుర్కోగల సత్తా ఉన్న మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ను పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), సురేష్ షేట్కార్ (నారాయణఖేడ్), విజయశాంతి (మెదక్), రమేష్ రాథోడ్ (ఖానాపూర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), మల్లు రవి (జడ్చర్ల), సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ కంటోన్మెంట్)లను శాసనసభ ఎన్నికల బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.