పింఛన్ పేరుతో మరోసారి మోసం.. కేసీఆర్ పై విజయశాంతి ఆగ్రహం
తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. పెన్షన్ పేరిట తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పింఛన్దారుల ప్రకటనపై తనదైన పద్దతిలో స్పందించారు. కొత్త పింఛన్దారులు మరో నెలరోజులు ఎదురు చూడక తప్పేలా లేదంటూ సోషల్ మీడియా వేదికగా తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కొత్త పింఛన్దారులు మరో నెలరోజులు ఎదురు చూడక తప్పేలా లేదని అన్నారు. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా అవి సెప్టెంబర్లోనే ఖాతాల్లో పడే పరిస్థితులు కనిపిస్తుందన్నారు. ప్రస్తుతానికి ఊరికి ముగ్గురు, నలుగురు చొప్పున మండలానికి 48 మందిని ఎంపిక చేసి.. వారికి మాత్రమే ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారని విమర్శించారు.
వారికి కార్డులొచ్చినా.. ఫలితం లేదనీ, అకౌంట్లలో డబ్బులు జమకాలేదని అన్నారు. కార్డుల పంపిణీ ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నెలాఖరు దాకా పంపిణీతోనే సరిపెట్టి సెప్టెంబర్ చివరలో పింఛన్లు జమచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. 2018 సెప్టెంబర్ తర్వాత బైఎలక్షన్స్ జరిగిన హుజురాబాద్, నాగార్జునసాగర్లో మినహా సర్కారు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదనీ అన్నారు.
గత నాలుగేండ్లలో రాష్ట్రంలో 3.30 లక్షల కొత్త పింఛన్ అప్లికేషన్లను అప్రూవ్ చేసినా.. పెన్షన్ మాత్రం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 57 ఏళ్లు నిండినోళ్లు మాత్రమే కాకుండా.... 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా, ఎయిడ్స్ బాధితులు కూడా ఉన్నారని తెలిపారు.
ఎంపీడీఓల లాగిన్లో అప్రూవల్ అయి ఉన్న 3.30 లక్షల మంది జాబితాను ఇప్పుడు మరోసారి వెరిఫై చేస్తున్నరని తెలిపారు. ఇందులో ఎవరైనా చనిపోయినవాళ్లుంటే.. జాబితా నుంచి తొలగిస్తున్నరు. ఇవి కాకుండా... 57 ఏండ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్ల కోసం నిరుడు ఆగస్టు, అక్టోబర్లో రెండుసార్లు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నారనీ, ఈ సమయంలో దాదాపు 10లక్షల దరఖాస్తులొచ్చాయనీ. కానీ అప్లికేషన్లు తీసుకుని ఏడాదైనా సర్కారు ఇప్పటిదాకా వాటిని వెరిఫై కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ అప్లికేషన్లు ఇంకా తమ లాగిన్లోకి రాలేదని ఎంపీడీఓలు చెప్తున్నారనీ, అప్లై చేసుకున్నవారిలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరో తేల్చకుండా... అందరికీ పింఛన్లు ఇవ్వడం కుదరదని, జాబితా వచ్చాక డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తే తప్ప అర్హులెవరో గుర్తించలేమని ఎంపీడీఓలు చెబుతున్నారని అన్నారు.
పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరు, ఖాతాల్లో జమ చెయ్యడం ఇలా ప్రతి దశలోనూ తీవ్ర జాప్యం చేస్తూ కేసీఆర్ సర్కారు ఏళ్ళకేళ్లు గడిపేస్తోంది. ఈ పరిస్థితి పింఛన్ ఆశావహుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సర్కారు ఉదాశీనవైఖరిని తిట్టుకుంటూ శాపనార్ధాలు పెడుతున్నరు. ప్రజల ఆక్రోశం ఈ సర్కారుని ముంచెత్తక తప్పదు ’’ అని టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.