సర్జికల్ స్ట్రైక్స్ అనగానే కంగారెందుకు..? విజయశాంతి
టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఇంటింటి సర్వే చేసిందని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో అలాంటి వారు లేరని కేంద్రానికి నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి రాగానే.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ చాలా సీరియస్ అయ్యారు. ఈనేపథ్యంలో ఈ విషయంపై విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు కంగారెందుకని, రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎంకు భయమెందుకని సూటిగా ప్రశ్నించారు. దానికి బదులు టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఇంటింటి సర్వే చేసిందని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో అలాంటి వారు లేరని కేంద్రానికి నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
ఇక సంజయ్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. బీజేపీకి దమ్ముంటే భారత్ సరిహద్దుల్లో తిష్టవేసిన చైనా సైన్యంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నారు. అదే విధంగా ఎంపీ సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పచ్చని హైదరాబద్ను పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ఓట్ల, సీట్ల కోసం బీజేపీ ఎంపీ పూర్తిగా మతితప్పి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.