కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యడం కన్నా వైసీపీ, జనసేనలను ఒకే వేదిక మీదకు తేవడమే కేసీఆర్ అసలు అజెండాగా కనిపిస్తోందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. 

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంత త్వరగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉచ్చులో పడకపోవచ్చని కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు వాస్తవంగా సమదూరం పాటిస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఏదో రకంగా వివాదంలోకి లాగేందుకు టీఆరెస్ కూడా ప్రయత్నం చేస్తోందని ఆమె అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ట్విట్టర్ వేదికగా విజయశాంతి పవన్ కల్యాణ్ రాజకీయ విధానంపై మాట్లాడారు. మాయావతి-అఖిలేష్ యాదవ్‌ల మాదిరిగా పవన్ కళ్యాణ్- చంద్రబాబు కలిస్తే తప్పేమిటని టీడీపీ నాయకులు అంటున్నారని, ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రాజ్ భవన్‌లో కేసీఆర్-పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరపడం మరింత గందరగోళానికి కారణమైందని రాములమ్మ అన్నారు. 

ఇంతకీ ఏపీకి వెళ్ళి వైఎస్ జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తానన్న కేసీఆర్ అంతకు ముందే పవన్‌తో మంతనాలు జరపడం ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వదలచుకున్నారని ఆమె ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యడం కన్నా వైసీపీ, జనసేనలను ఒకే వేదిక మీదకు తేవడమే కేసీఆర్ అసలు అజెండాగా కనిపిస్తోందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. 

ప్రజారాజ్యం పొత్తు వద్దని టీడీపీతో 2009లో జత కట్టిన కేసీఆర్ గురించి సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి పవన్‌కి టీఆరెస్ జిత్తులపై బాగానే క్లారిటీ ఉంటుందేమోనని అన్నారు. పవన్ అంత త్వరగా కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చునని ఆమె అన్నారు.