దుబ్బాక ఎన్నికల్లో బదిలీ: సిద్ధిపేట కలెక్టర్ గా మళ్లీ వెంకట్రామి రెడ్డి
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సిద్ధిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి బదిలీ అయిన విషయం తెలిసిందే. వెంకట్రామి రెడ్డిని తిరిగి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హైదరాబాద్: పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా తిరిగి పి. వెంకటరామిరెడ్డిని నియమించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో ఆయనను సిద్ధిపేట జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు గత నెలలో బదిలీ చేశారు.
దుబ్బాక ఉప ఎన్నికలు పూర్తి కావడంతో ఆయను తిరిగి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. అదే విధంగా మెదక్ జిల్లా కలెక్టర్ గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దుబ్బాక ఎన్నికలకు ముందు సిద్ధిపేట కలెక్టర్ గా నియమితులైన మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికెరిని తిరిగి మంచిర్యాలకు పంపించారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. పెద్దపల్లి కలెక్టర్ గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న శశాంకను రివీల్ చేశారు. ఆమె స్థానంలో భారతి హొళికరికి అదనపు బాధ్యతలు అప్పగించారు.
మేడ్చెల్ మల్కాజిరిగి జిల్లా కలెక్టర్ వి. వెంకటేశ్వర్లును బదిలీ చేశారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.