తప్పతాగి కారు నడిపి చంపారు: టెక్కీ సహా ఫ్రెండ్ అరెస్ట్, కారులో బీరు బాటిల్స్
రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి కారు దూసుకెళ్లడంతో హైదరాబాదులోని వనస్థలిపురంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటన తెలిసిందే. తప్పతాగిన ప్రమాదానికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీరును, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి కారు దూసుకెళ్లడంతో హైదరాబాదులోని వనస్థలిపురంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటన తెలిసిందే. తప్పతాగిన ప్రమాదానికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీరును, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వారు నడిపిన రెనౌల్ట్ కారు నుంచి రెండు ఖాళీ బీరు బాటిల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేస్కున్నారు. హయత్ నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు భవ్య తేజ్ రెడ్డి (27), చింతపల్లికి చెందిన మొహమ్మద్ రహీం (24) పోలీసులు అరెస్టు చేసారు.
పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం... ఆ ఇద్దరు ప్రమాదం చేసిన రోజు రాత్రి పదిన్నర గంటలకు ఆటోనగర్ లోని ఎంఆర్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లి మద్యం సేవించారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో బయటకు వచ్చి కారులో మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు వైపు ప్రయాణించారు.
వారిద్దరు మద్యం సేవించడానికి బారులోకి వెళ్లినట్లు సిసీటీవి ఫుటేజీ ద్వారా తెలిసింది. బారు నుంచి వచ్చేటప్పుడు రెండు బీరు బాటిల్స్ ను ప్యాక్ చేయించుకున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి.
వారు నడుపుతున్న కారు రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లడంతో అందులో నిద్రిస్తున్న భవ సింగ్ (34), ఈశ్వర్ లాల్ ((30) మరణించారు. రామ్ సింగ్ సింగ్, మాన్ సింగ్ స్వల్పంగా గాయపడ్డారు.
రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ఆ నలుగురు రోడ్డు పక్కన మహావీర్ వనస్థలి పార్కు పక్కన స్టాల్ నడుపుతున్నారు. బెడ్ షీట్స్, బ్లాంకెట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు
బారు నుంచి మిత్రులిద్దరు బయలుదేరిన సమయంలో భవ్య తేజ్ రెడ్డి కారు నడుపుతున్నాడు. నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపు తప్పి గుడిసెలోకి దూసుకెళ్లింది. దాంతో భవ సింగ్ అక్కడికక్కడే మరణించగా, ఈశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. భవ సింగ్ కు భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.