కోవిడ్ వ్యాక్సినేషన్: టీకా సెంటర్లు పెంపు.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
కోవిడ్ను నివారించేందుకు గాను నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తొలి రోజు విజయవంతంగా టీకాలను వేశారు.
కోవిడ్ను నివారించేందుకు గాను నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ తొలి రోజు విజయవంతంగా టీకాలను వేశారు. తొలి విడతలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో సెలవు ప్రకటించారు.
మరోవైపు తెలంగాణలో సోమవారం నుంచి వాక్సిన్ సెంటర్లను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు రాష్ట్రంలో 500 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
30 నుంచి 100 మంది వరకు వాక్సిన్ తీసుకొనేలా ఏర్పాట్లు చేశామని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పాయి. కొవిన్ సాప్ట్వేర్లో సాంకేతిక సమస్యలు వచ్చాయని.. లబ్ధిదారుల ఎంపికపైనా ఇబ్బందులు వస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read:వ్యాక్సినేషన్ సక్సెస్.. తొలి రోజు 3,530 మందికి టీకా: తెలంగాణ హెల్త్ డైరెక్టర్
మాన్యువల్గా అయినా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం తెలంగాణలో తొలి రోజు విజయవంతమైంది. శనివారం ఉదయం 10.30 తర్వాత రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణలో తొలి టీకాను గాంధీ ఆస్పత్రిలో సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్న వాల కిష్టమ్మకు వేశారు. ఆమె గాంధీ ఆస్పత్రిలో 14 ఏళ్లుగా సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్నారు. కరోనా ఉద్ధృతంగా ఉన్నప్పుడు కిష్టమ్మ కుటుంబానికి సైతం దూరంగా ఉంటూ.. కొవిడ్ వార్డుల్లో సేవలు అందించారు.