నిత్య జన గణ మన కార్యక్రమానికి యూపీ డిప్యూటీ సీఎం.. జాతీయత స్ఫూర్తిని వెదజల్లుతున్న యువత అంటూ ప్రశంసలు
Nithya Janaganamana Programme: హైదరాబాద్లో నిర్వహిస్తున్న నిత్య జన గణ మన కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న లీడర్స్ ఫర్ సేవా సంస్థ నేతలను అభినందించారు.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నల్లకుంటలో లీడర్స్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్య జన గణ మన కార్యక్రమం (Nithya Janaganamana Programme) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ రోజు హాజరయ్యారు. జాతీయతా స్ఫూర్తిని విస్తరింపజేస్తున్న యువతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
నల్లకుంటలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారని సంస్థ నాయకులు నేలంటి మధు, మల్లాడి క్రాంతి, సర్వు అశోక్, జూకంటి ప్రశాంత్, ఎంకే శ్రీనివాస్, నల్ల ప్రవీణ్లను ప్రశంసించారు. వారి జాతీయతా స్ఫూర్తిని కొనియాడారు. నిత్య జన గణ మన కార్యక్రమం స్ఫర్తినిచ్చేదిగా ఉన్నదని అన్నారు. Nithya Janaganamana కార్యక్రమం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
జమ్మికుంట నుంచి బైక్ ర్యాలీ ద్వారా త్రివర్ణ పతాకాన్ని తెచ్చి ఇక్కడ స్థాపించారని, 50 రోజులుగా ప్రతి రోజూ జన గణ మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నిర్వాహకులు ఆయనకు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగించాలని భావిస్తున్నట్టు వారు చెప్పగా.. కేశవ్ ప్రసాద్ మౌర్యం ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతిచోట ప్రతి ఒక్కరూ నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బీజేపీ నేతలు కొంపె శిరీష, రమ్య వన్నాడి, మర్రి మురళి తదితరులు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. హైదరాబాద్లో నిత్య జన గణ మన (Nithya Janaganamana) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేలంటి మధును ప్రతి ఒక్కరూ అభినందించారు.