తెలంగాణలో ప్రభుత్వాధికారులకు కొందరు కేటుగాళ్లు ఉన్నత అధికారుల్లాగా చెప్పుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల తహశీల్దార్‌కు ఓ ఆగంతకుడు ఏసీబీ అధికారిగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. 


జగిత్యాల జిల్లా (jagtial district) మల్యాల తహశీల్దార్ (malyala tahsildar) సుజాతకు ఏసీబీ (acb officials) అధికారులమంటూ ఆగంతకులు ఫోన్ చేయడం (fake call) సంచలనం సృష్టించింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో 9908997822 నంబరు ద్వారా తహశీల్దార్ సుజాతకు ఫోన్ చేశారు ఆగంతకులు. మీపైన అవినీతి ఆరోపణలు వచ్చాయని రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా షాకైన తహశీల్దార్ తనపైన ఎలాంటి ఆరోపణలు లేవని కావాలంటే విచారణ జరుపుకోవాలని సమాధానం చెప్పారు. అంతకు ముందు అదే నెంబర్ నుంచి మల్యాల ఎస్ఐ చిరంజీవికి ఫోన్ చేసి తాను ఏసీబీ.. డీఎస్పీని అని.. మీ మండల తహశీల్దార్ ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందిగా అడిగాడు. దీంతో ఎస్ఐ ఫోన్‌లోనే తహశీల్దార్ సుజాత నంబర్ ఇచ్చారు. అనంతరం ఆయన తహశీల్దార్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు.

అదే సమయంలో సదరు వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు తహశీల్దార్ తెలిపారు. తను ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఉన్నానని చెప్పినప్పటికీ కూడా అవతలి వైపు వ్యక్తి.. తన భర్త నంబర్ ఇవ్వమని పలుమార్లు అడగడంతో తాను భర్త నంబర్ ఇచ్చినట్లు సుజాత పేర్కొన్నారు. అనంతరం సదరు వ్యక్తి.. తన భర్తకు ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు. దీంతో సాయంత్రం సమయంలో తనకు వచ్చిన నకిలీ ఫోన్‌ కాల్‌పై తహశీల్దార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే మండల స్థాయిలో ఉన్నతాధికారికే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.

 

"