తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2017-19 మధ్య కాలంలో రెండు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2017-19 మధ్య కాలంలో రెండు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తెలంగాణలోని జహీరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్.. గాంధారిలో తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రాలు చూడాలని తెలంగాణ మంత్రి అంటున్నారని.. ముందు ఇక్కడ ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూడాలని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ వంద మంది రైతుల్లో ఐదు మందికే రుణమాఫీ జరిగిందన్నారు. ఇది తాను చెప్పింది కాదని.. ఎస్బీఐ చెప్పిందని తెలిపారు.
ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయినవారికి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. తెలంగాణకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నామని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 7,658 కోట్లు ఇచ్చామని తెలిపారు. కృషి వికాస్ యోజన కింద రూ. 8,590 కోట్లు ఇచ్చినట్టుగా చెప్పారు. తెలంగాణకు ఎన్ఎఫ్ఎన్ఎస్ స్కీమ్ కింద రూ. 51 కోట్లు ఇచ్చామని అన్నారు.
తెలంగాణలో భయంకరమైన వాతవరణాన్ని ఏర్పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతుల విషయంలో ఎవరైనా రాజకీయాలు చేయడానికి వీలు లేదని అన్నారు.
