రాష్ట్రంలో  స్వమిత్వ  పథకాన్ని  అమలు  చేయాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వమిత్వ పథకాన్ని అమలు చేయాలని ఆ లేఖలో సీఎం కేసీఆర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే పథకం స్వమిత్వ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ పథకం కింద ఆస్తి ధృవీకరణ పత్రాల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ పథకం కింద రూపొందించిన ల్యాండ్ రికార్డులు గ్రామీణాభివృద్దికి దోహదపడతాయని కిషన్ రెడ్డి చెప్పారు. 
దేశంలోని అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని 2025 మార్చి నాటికి అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

కేంద్రంలో పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పంచాయితీరాజ్ శాఖ, రెవిన్యూ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయన్నారు. 

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు గ్రామాల్లో విజయవంతంగా సర్వే నిర్వహించిన విషయాన్ని మంత్రి ఈ లేఖలో ప్రస్తావించారు. 

మరో వైపు ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయమై చొరవ చూపాలని ఆ లేఖలో కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు